Tuesday, June 28, 2011

వీటిని తినండి .. ... బరువు తగ్గండి

కాస్త లావుగా ఉంటే చాలు...తిండి తగ్గించమని సలహాలు ఇస్తుంటారందరూ. దాంతో చాలామంది పొట్టమాడ్చుకునే పనిలో పడతారు. లావు తగ్గడానికి ఉపవాసం పరిష్కారం కాదంటారు పోషకాహార నిపుణులు బి. జానకి. తింటూ కూడా బరువు తగ్గొచ్చంటారు ఆమె. అందుకు కొన్ని ప్రత్యేక వంటలు ఉన్నాయని చెప్పారు. అటువంటి వంటలకు సంబంధించి నగరంలోని కొందరు డైటీషియన్లకు ఆమె వంటల పోటీలు కూడా నిర్వహించారు. ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వంటలపోటీల్లో నుంచి కొన్ని వంటలు మీ కోసం ఇస్తున్నాం చూడండి.
స్వీట్ కార్న్ పనీర్ సలాడ్...
కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ - 100 గ్రా, పనీర్ - 50 గ్రా, క్యారెట్ - 20 గ్రా, టమోట - 10 గ్రా, క్యాప్సికం - 10 గ్రా, ఉల్లిపాయముక్కలు - 10 గ్రా, కొత్తిమీర - ఒక కట్ట, నిమ్మకాయ చెక్క - ఒకటి, మిరియాల పొడి - అర టీ స్పూను, చాట్ మసాలా - అర టీ స్పూను, ఉప్పు - తగినంత,

తయారుచేయు విధానం: ముందుగా స్వీట్‌కార్న్, క్యారెట్, కాప్సికమ్‌ని విడివిడిగా ఉడికించుకుని పెట్టుకోవాలి. తరువాత పనీర్‌లో వీటిని కలిపి వేగించుకోవాలి. వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, మిరియల పొడి, ఉల్లిపాయముక్కలు, టమోట ముక్కలు, చాట్ మసాలా, కొత్తిమీర తురుము వేసి బాగా కలపాలి. చివర్లో నిమ్మకాయ పిండాలి. అంతే స్వీట్‌కార్న్ పనీర్ సలాడ్ తయారయినట్టే. కాలరీలు: 240, ప్రొటీన్లు : 10

రెయిన్‌బో చపాతీ
కావలసిన పదార్థాలు: గోధుమపిండి - 15 గ్రా, సోయాపిండి - 10 గ్రా, రాగిపిండి - 5 గ్రా, శెనగపిండి - 5 గ్రా, అవిసలు - 2 గ్రా, పాలకూర - 25 గ్రా, క్యారెట్ తురుము - ఒక టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయ -ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, గరంమసాల - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - రెండు టీ స్పూన్లు. మొలకెత్తిన గింజలు - రెండు టేబుల్ స్పూన్లు, పెరుగు.

తయారుచేయు విధానం: ఒక గిన్నెలోకి గోధుమపిండి, సోయాపిండి, రాగిపిండి, శెనగపిండి, అవిసలు, పాలకూర తురుము, క్యారెట్ తురుము, గరం మసాలా, ఉప్పు, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి చపాతిపిండిలా కలుపుకోవాలి. ఒక అరగంట నానిన తర్వాత చపాతీలు ఒత్తుకుని పెనంపై కాల్చుకోవాలి. పెరుగులో మొలకెత్తిన గింజలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. అన్ని రకాల పిండితో చేసిన ఈ రెయిన్‌బో చపాతీలను పెరుగులో నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. క్యాలరీలు : 231, ప్రొటీన్లు: 15, ఫైబర్ : 2

రాగి డంప్లింగ్...
కావలసిన పదార్థాలు: రాగిపిండి - ఒక కప్పు, చికెన్ - పావుకిలో, ఉల్లిపాయలు - రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను, పచ్చిమిరపకాయలు - నాలుగు, గరం మసాలా - అరటీ స్పూను, కారం - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, కొత్తిమీరతురుము - ఒక టేబుల్ స్పూను, పసుపు - చిటికెడు, నూనె - తగినంత.

తయారుచేయు విధానం: ముందుగా రెండు కప్పుల నీళ్లను మరిగించాలి. అందులో కొద్దిగా ఉప్పు, రాగిపిండి వేసి ఉడికించాలి. గట్టిగా అయ్యాక దించేయాలి. స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి - బాగా కాగాక అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కోసిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేగించాలి. తరువాత చికెన్ వేయాలి. తగినంత ఉప్పు, గరంమసాలా, కారం కూడా వేసి బాగా కలిపి మూతపెట్టాలి. సన్ననిమంటపై ఓ పావుగంట ఉడికించాలి. మధ్య మధ్యలో గరిటతో కలుపుతుండాలి. ముక్క మెత్తగా ఉడికన తర్వాత కొత్తిమీర వేసి దించేయాలి. ఇప్పుడు ఉడికించిన రాగి ముద్దని ఉండలుగా చేసుకోవాలి. ఉండని వెడల్పుగా చేసి మధ్యలో చికెన్‌ముక్కలు పెట్టి చుట్టూ మూసివేయాలి. ఇలా చేసిన రాగి ఉండల్ని ఓవెన్‌లో ఉడికించాలి. రుచికరమైన రాగి డంప్లింగ్స్ తయారయినట్టే. క్యాలరీలు: 280, ప్రొటీన్లు - 18, కాల్షియం - 235, ఫైబర్ - 3

ఎగ్‌వైట్ నెస్ట్...
కావలసిన పదార్థాలు: గుడ్లు - మూడు, పచ్చిబఠానీలు -100గ్రా, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, ఉల్లిపాయలు - ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిమిరపకాయలు - రెండు, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.

తయారుచేయు విధానం: ముందుగా గుడ్లని ఉడికించుకోవాలి. ఉడికిన గుడ్లని నిలువుగా కోసి మధ్యలో పచ్చసొన తీసేయాలి. తరువాత బఠానీలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి బాగా కాగాక ఆవాలు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి బాగా వేగించాలి. తరువాత ఉప్పు, పసుపు, ఉడికించి పెట్టుకున్న బఠానీలు వేసి వేగించాలి. సన్ననిమంటపై ఓ ఐదు నిమిషాలు ఉడికించి కొత్తిమీర వేసి దించేయాలి. ఈ కూరని ఉడికించి పెట్టుకున్న గుడ్డు ముక్కల్లో వేయాలి. క్యాలరీలు: 245

లాకి టోఫు బటన్స్...
కావలసిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు - 100 గ్రా, పనీర్ - 50 గ్రా, క్యారెట్ - 50 గ్రా, ఓట్స్ - 10 గ్రా, ఉసిరికాయ రసం - ఒక టేబుల్ స్పూను, గోధుమ పిండి - 10 గ్రా, జొన్న పిండి - 10 గ్రా, శెనగపిండి - 10 గ్రా, ఆలివ్ఆయిల్ - 10 గ్రా, జీలకర్ర, ఆవాలు - అరటీ స్పూను, పుదీన - రెండు కట్టలు, మిరపకాయలు - నాలుగు, ఉప్పు - తగినంత.

జ్యూస్‌కోసం తయారి: ముందుగా ఆనపకాయ, కారెట్ మిక్సీలో వేసుకుని జ్యూస్ చేసుకోవాలి. దీంట్లో ఉసిరికాయ రసం కలుపుకోవాలి. పచ్చడి తయారి: స్టౌ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి పుదీన ఆకులు, పచ్చిమిరపకాయలు వేసి వేగించాలి. చల్లారిన తర్వాత ఉప్పు కలిపి మిక్సిలో వేసి పచ్చడి చేసుకోవాలి.

బటన్స్ తయారి: పనీర్ ముక్కల్ని నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. గోధుమపిండి, జొన్నపిండి, శెనగపిండి, ఆవాలు, జీలకర్ర, వేగించిన పనీర్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఉండలుగా చేసుకుని ఓ పదినిమిషాలు జున్నుని ఉడికించినట్టు ఉడికించాలి. తరువాత వీటిని పెనంపై కొద్దిగా నూనె వేసి వేగించాలి. వీటిని పుదీన చట్నీలో నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. చివర్లో ఆనపకాయ, క్యారెట్ జ్యూస్ తాగాలి. క్యాలరీలు: 270, ప్రొటీన్లు : 16.5, ఫైబర్: 5.8, కాల్షియం: 22

Tuesday, June 14, 2011

నడుస్తున్న వైద్యం '' మూలికోపతి ''

అజీర్తి, ఎసిడిటీ, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు, అల్సర్లు, జుట్టు రాలడం, చర్మ రోగాలు, దంతసమస్యలు, మానసిక ఆందోళనలు, మధుమేహం, రక్తపోటు, ప్రాణాంతక క్యాన్సర్లు... లైఫ్‌స్టయిల్ కారణంగా వచ్చిన రుగ్మతలు కావచ్చు, శరీర రసాయన ధర్మంలో మార్పుల కారణంగా తగులుకున్న రోగాలూ కావచ్చు. ఆయుర్వేద పరిభాషలో చెప్పాలంటే వాత, పిత్త, కఫ సంబంధ రుగ్మతలన్నింటికీ జనామోదం లభిస్తున్న పరిష్కారం హెర్బల్ ట్రీట్‌మెంట్. మూలికావైద్యం. ఒకప్పుడు అది ప్రాచీన వైద్యం.. ఇప్పుడదే ఇన్‌థింగ్. ఆధునికత అంగీకరించి ఆహ్వానిస్తున్న పురాతన విధానం.

ఇంగ్లీష్‌లో హెర్బ్స్, హిందీలో జరీబూటి, తెలుగులో మూలికలు - వీటితో వైద్యమే ఇప్పుడు ప్రపంచాన్నంతా ఊపేస్తోంది. వేల కోట్ల డాలర్ల అలోపతి వైద్యానికి సవాలు విసురుతోంది. మూలికావైద్యం, దేశీయ వైద్య విధానాలు ఆగినచోట అలోపతి పుట్టిందని ఒకనాటి భావన. అలోపతి ఆగిపోయిన చోట మూలికావైద్యం ప్రస్థానం ప్రారంభమైందన్నది నేటి కొత్త విశ్వాసం. మూలికావైద్యానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా పరిఢవిల్లిన ప్రతి నాగరికత మూలాల్లోనూ మూలికల విజ్ఞానం నిబిడీకృతమై ఉంది. ప్రతి సమాజంలోనూ ప్రకృతి శరీరధర్మంపై చూపే ప్రతికూల ప్రభావాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి మూలవాసులు మూలికలనే ఆశ్రయించారు. అయితే శాస్త్రీయ పునాదులతో అలోపతి వైద్య విధానం వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత దేశీయవైద్యవిధానాల్లో 'శాస్త్రీయత' కొరవడిందనే పేరుతో ముప్పేట దాడులు మొదలయ్యాయి. ఆ దాడుల తొలి విక్టిమ్ మూలికా వైద్యం.

వ్యాపారం - లాభం నిండి ఉన్న అలోపతిని ఫార్మాసంస్థలు, ఆధునిక వైద్యులతో పాటు సోకాల్డ్ హేతువాదులు, 'జనవిజ్ఞానులు' నెత్తికెక్కించుకుని సంప్రదాయ విజ్ఞానంపై దాడులకు దిగుతున్నారు. దీనివల్ల సంప్రదాయ విజ్ఞానం సమసిపోకున్నా మసకేసిపోయింది. థాంక్ గాడ్. కొన్ని రకాల రుగ్మతలకు విషయంలో అలోపతి వైద్య విధానంలో పరిష్కారాలు లేకపోవడంతో గత కొన్నేళ్లుగా మళ్లీ సంప్రదాయ, దేశీయ వైద్యవిధానాలకు ఆదరణ పెరుగుతున్నది. ఈ వైద్య విధానాలకు పాతవైభవాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నవారు సాధిస్తున్న విజయాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మూలికావైద్యం అనూహ్యమైన ప్రాచుర్యాన్ని పొందుతున్నది. ఆధునిక జీవితంలో హెర్బ్స్ అంతర్భాగంగా మారిపోతున్నాయి. హెర్బల్ టీ, హెర్బల్ బాత్ పౌడర్, హెర్బల్ టూత్‌పేస్ట్ మొదలు చిన్నా, పెద్ద శారీరక, మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే పలురకాల హెర్బల్ ఉత్పత్తులు ఇప్పుడు ప్రతి ఇంటా దర్శనమిస్తున్నాయి.

అశ్వగంధ, సర్పగంధ, శతావరి, ఆమ్లా, అలోవెరా, బ్రహ్మి, వేప, ఆల్ఫాల్ఫా, నేల ఉసిరి, అడవిచామంతి, పసుపు, వెల్లుల్లి, అల్లం, అవిశెలు, జీలకర్ర, మెంతులు, కరివేప... ఇవి అరుదైన మూలికలూ కావచ్చు, పోపు పెట్టెలో కనిపించే దినుసులూ కావచ్చు.

వేదకాలం నుంచే...

రుగ్వేదంలో తొలుత మూలికల ప్రస్తావన కనిపిస్తుంది. సోమ గురించి ఎక్కువ ప్రస్తావించినా రావి, పలాస వంటి ఇతర మూలికల పేర్లు కూడా రుగ్వేదంలో కనబడతాయి. ఇంద్రునికి అత్యంత ఇష్టమైన సోమపానం తయారీకి ఉపయోగించిన మూలికే సోమ. ఆధునిక వృక్ష శాస్త్రవేత్తలు ఈ సోమ మూలికను గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సోమ మూలికకు సంబంధించి ఆయుర్వేద వైద్యుల్లోనూ ఏకాభిప్రాయం లేదు. బహుశా ఇది అంతరించి పోయిన మొక్కల జాతికి చెంది ఉండవచ్చని కొందరి భావన. అధర్వణవేదంలో దాదాపు 100 మూలికల ప్రస్తావన ఉన్నా వాటిలో అనేకం ఇప్పుడు లభ్యం కావడం లేదు. వాటిని పోల్చేందుకు వృక్షశాస్త్ర నామం ఏమిటో తెలియడం లేదు. దేశీయ వైద్య పద్ధతులను క్రమబద్ధీకరించిన ఘనత చరకునిది. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో చరకుడు మూలికా వైద్యాన్ని భారతదేశంలోని జానపదుల వైద్య విధానాలను గ్రంథస్థం చేశారు. ప్రాచీన భారతంలో చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు అసమానవైద్యులుగా గుర్తింపు పొందారు.

ప్రపంచవ్యాప్తంగా పేరున్న 100 మూలికల్లో 50 మూలికలు భారతీయులు తరతరాలుగా వినియోగిస్తున్నారు. ప్రపంచమంతటా గుర్తింపుపొందిన చైనా మూలికల్లో 20 మూలికలు మన దేశీయ వైద్యంలో కూడా విరివిగా వినియోగంలో ఉన్నాయి. చైనా ప్రభుత్వం అలోపతి పరిమితులను గుర్తించి ప్రజారోగ్య సంరక్షణ కోసం సంప్రదాయ వైద్య విధానాలకు పెద్దపీట వేయడంతో చైనా సంప్రదాయ వైద్యం అంతర్జాతీయంగా పాపులర్ అయింది. నిజానికి మన బలవర్ధక, అశ్వగంధ, తిప్పతీగ, బోడతరము, నేలతంగేడు, గుంటకలగర, చిత్రమూలము, పల్లేరు వంటి ఔషధ మొక్కలు, పసుపు, వేప, కానుగ, వావిలి, జిల్లేడు.. ఇదే కోవకు చెందిన చైనీస్ మొక్కల కంటే శక్తిమంతమైనవి. యూరప్, అమెరికాల్లో లభించే మూలికలతో పోలిస్తే కూడా అదే జాతికి చెందిన భారతీయ మూలికలను ఎక్కువ శక్తిమంతమైనవిగా భావిస్తారు. మరీ ముఖ్యంగా హిమాలయాల్లో లభించే మూలికలను మహిమాన్వితమైనవిగా విశ్వసిస్తారు.

ఈజీగా ఇంటిలోనే...

దేశీయ వైద్యంలో ఆయుర్వేదం, సిద్ధ, యునాని, హోమియోపతి, నాచురోపతి విధానాలున్నాయి. వీటన్నిటిలోనూ ఔషధ మూలికలను వినియోగించినప్పటికీ మూలికావైద్యానికి ఈ వైద్య విధానాలకు తేడా ఉంది. ముఖ్యంగా ఆయుర్వేదానికి మూలికా వైద్యానికి తేడా లేదనుకుంటారు. అది సరికాదు. ఆయుర్వేదం కొన్ని సందర్భాల్లో సంక్లిష్టమైన ప్రక్రియలతో కూడింది. ఒకటి కంటే ఎక్కువ మూలికల సంయోజనం, విలీనం వంటివి అందులో జరుగుతాయి. జంతు, ఖనిజ, లోహ సంబంధమైన వాటిని కూడా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదానికి ప్రామాణిక గ్రంధాలున్నాయి. ఒకరకంగా ఇవి సాధారణ మూలికలకు వాల్యూ యాడెడ్ ప్రాడక్ట్స్. మూలికావైద్యంలో నేరుగా లభించే మూలికలనే ఉపయోగిస్తారు. వాటిని తయారు చేయడంలో రకరకాల ప్రక్రియలు ఉన్నప్పటికీ అవి సులభమైనవే. నాలుగైదు కంటే మూలికలను సంయోజనపరిచే అవకాశం మూలికావైద్యంలో లేదు. కావలసిన మూలికలు లభిస్తే ఎవరికి వారు ఔషధాలను తయారు చేసుకునే వెసులుబాటు ఈ విధానంలో ఉంది.

మూలికా వైద్యంలో మొక్కల వేర్లు, కాండం, బెరడు, ఆకులు, మొగ్గలు, పూలు, కాయలు, పండ్లు, గింజలు, చిగుళ్లను... ఔషధ పదార్ధాలుగా ఉపయోగిస్తారు. ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది.. ఏ ఆకును ఏ రకంగా ఉపయోగించవచ్చు.. వగైరా విషయాలకు సంబంధించిన సాధారణ జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి వందల సంవత్సరాలుగా అందుతూ వస్తున్నది. మధ్యలో 'శాస్త్రీయ విప్లవం' సృష్టించిన అంతరం వల్ల ఒకటి రెండు తరాలకు ఈ జ్ఞానం దూరమైంది. వివిధ గిరిజన తెగల్లో మూలికలకు సంబంధించిన అద్భుతమైన పరిజ్ఞానం ఉంది. వారు సాధారణ, అసాధారణ వ్యాధులను సైతం అందుబాటులో ఉన్న మూలికలతోనే నయం చేసుకునే ప్రయత్నం చేస్తారు. గిరిజనుల నుంచి ప్రాచీన రుషుల నుంచి పల్లెల నుంచి క్రమంగా మూలికా వైద్యం విస్తరిస్తూ వచ్చింది. ఔషధాలుగా వాడే చాలా మూలికలు ఆహారంగానూ, మసాలా దినుసులు గానూ, సుగంధ ద్రవ్యాలుగానూ మారి వేలాది సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి. పసుపు, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇలాంటివే.

అదిరిపోతున్న ప్రచారం..

యోగ గురువు బాబా రామ్‌దేవ్, ఆయన సహచరుడు బాలకృష్ణ మహరాజ్ యోగతో పాటు ఆయుర్వేదాన్ని మరీ ముఖ్యంగా మూలికల ప్రశస్తిని విస్త­ృతంగా ప్రచారంలోకి తెచ్చారు. పొద్దున్నే ఆస్తా టీవీలో జరీబూటీపై బాలకృష్ణ చెప్పే విషయాలు మూలికల సామర్థ్యాన్ని సామాన్యులకు చేరవేశాయి. ఆ తర్వాత దాదాపు అన్ని టీవీఛానళ్లు, ఇతర ప్రచార సాధనాలు దీనిని అందిపుచ్చుకున్నాయి. మధ్యాహ్నం వంటిల్లు కార్యక్రమంలో వంటలను పరిచయం చేయడం ప్రతి టీవీ ఛానెల్లోనూ ఎంత సాధారణమైందో ఇప్పుడు పొద్దున్నే ఒక అరగంట వైద్యం-ఆరోగ్యం పేరుతో రకరకాల మూలికలను పరిచయం చేయడం, వాటి ఉపయోగాలను వివరించడం అంతే సాధారణమైంది. చాలామంది వీటిని నోట్‌బుక్‌లో రాసుకుని బంధుమిత్రులకు చేరవేయడం కూడా వర్తమాన దృశ్యం.

టీవీల్లో ప్రచారాలకు తోడుగా ఆయుర్వేదం, మూలికా వైద్యంపై తెలుగులోనే ఇటీవల కాలంలో డజన్ల సంఖ్యలో పుస్తకాలొచ్చాయి. రకరకాల మూలికలు, వాటి లక్షణాలు, ఉపయోగాల గురించి వివరించే పుస్తకాలతో పాటు, రకరకాల వ్యాధులు వాటి చికిత్సలో ఉపయోగపడే మూలికలను గురించి వివరించే పుస్తకాలూ ఉన్నాయి. డాక్టర్ కొప్పుల హేమ్రాది 'వనమూలికా ప్రభావం' డా. జి. లక్ష్మణరావు 'మూలికా వైద్యంతో ఆరోగ్యం', డాక్టర్ ఏల్చూరి ఆయుర్వేద పత్రిక ఇంకా అనేక పుస్తకాలు, మేగజైన్లు మార్కెట్లో ఉన్నాయి. అంతేకాక చిట్కా వైద్యంపై ప్రతి పత్రికలోనూ కాలమ్ ఉంటున్నది. ఇంట్లో అందుబాటులో ఉండే దినుసుల్లో దాగి ఉన్న ఆరోగ్య ర హస్యాలపై విరివిగా రాసే వారి సంఖ్య పెరుగుతున్నది.

మూలికలపై పరిశోధనలు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. అసంఖ్యాకమైన మూలికాధార ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. నేరుగా మూలికలనే విక్రయిస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. ఇందులో అవ్యవస్థీకృత రంగంలోని సంస్థలతో పాటు వ్యవస్థీకృత రంగంలో కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. హిమాలయ డ్రగ్స్ సంస్థ అర్జున, అశ్వగంధ, బ్రహ్మి, హరీద్ర, కపికచ్చు, పునర్నవ, శొంఠితో సహా దాదాపు 30 వరకు మూలికలను శుద్ధంగా మాత్రల రూపంలో అందిస్తున్నది. అనేక ఆయుర్వేద ఔషధ దుకాణాల్లో ఇటీవల కాలంలో చిన్నచిన్న ప్యాకెట్స్‌లో రకరకాల మూలికల పౌడర్లను విక్రయిస్తున్నారు.

తస్మాత్ జాగ్రత్త..

ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ, ప్రత్యామ్నాయ వైద్య విధానాలకు ఆదరణ పెరుగడంతో వీటి వ్యాపారం 12000 కోట్ల డాలర్లకు చేరింది. 2050 కల్లా ఈ వ్యాపారం 7 లక్షల కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. భారత్‌లో దేశీయ మూలికా వ్యాపారం 10,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా. అమెరికా, కెనడా, జపాన్, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియాతో సహా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో హెర్బల్ వైద్యం పుంజుకుంటున్నది. భారత్ నుంచి ఏటా 3000 కోట్ల రూపాయల విలువైన మూలికలు ఎగుమతి అవుతున్నాయి. భారత్‌తో పోలిస్తే చైనా ఎగుమతులు ఇంకా చాలా ఎక్కువ. దాదాపు 20 వేల కోట్ల రూపాయల విలువైన హెర్బ్స్‌ను చైనా ఎగుమతి చేస్తున్నది. దేశంలో మొత్తం 15 ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉన్నాయి.

ఈ జోన్స్‌లో మొత్తం 18000 రకాల పుష్పజాతులున్నాయి. అందులో 7000 రకాల మొక్కలను వైద్యంలో వినియోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా 960 రకాల మొక్కలను వైద్య చికిత్సలో విరివిగా వాడుతున్నారు. జాతీయంగా అంతర్జాతీయంగా కూడా భారీ ఎత్తున ఈ మొక్కల ట్రేడింగ్ జరుగుతున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రధానంగా 178 జాతుల మొక్కల వినియోగం దేశీయంగా కొన్ని వందల టన్నుల్లో ఉంది. అయితే ఈ విధానాల కారణంగా భారత్‌కు శతాబ్దాలుగా గర్వకారణంగా ఉన్న అమూల్యమైన ఔషధ మొక్కల జాతులు అంతరించిపోతున్నాయన్న విమర్శలూ వస్తున్నాయి. అదొక కోణమైతే తాత్కాలికమైన అభివృద్ధి కోసం అరణ్యాలను, కొండలను ధ్వంసం చేస్తున్న కారణంగా, ఏజెన్సీ ప్రాంతాలను చదును చేస్తున్న కారణంగా స్వీయ అవసరాలకు సరిపడా ఔషధ మొక్కలు కూడా భవిష్యత్‌లో మనకు అందుబాటులో ఉండకపోవచ్చు.

దివ్యౌషధాలు

ఆల్పాల్ఫాకు వ్యాధినిరోధక శక్తిని ప్రసాదించే గుణం ఎక్కువ. ఆల్ఫాల్ఫాను గింజల పొడిగా, మొలకలుగా, టీ ఆకు పసరుతో చేసిన కషాయంగా... ఇలా రకరకాల రూపంలో తీసుకోవచ్చు. ఆల్ఫాల్ఫా గింజలను వంటకాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. దంతాలను, చిగుళ్లను, ఊపిరితిత్తులను, రక్తధమనులను, గుండెను అది శక్తిమంతంగా ఉంచుతుంది.
మన రాష్ట్రంలో విరివిగా కనిపించే కలుపుజాతి గడ్డి చేమంతి అనే మొక్కను ఎగ్జిమా నివారణకు శక్తిమంతంగా ఉపయోగించవచ్చని అంటున్నారు. దీనిని రైతులు పశువుల గాయాలు, పుండ్లకు వైద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు.
రోడ్డుపక్క కనిపించే నేలఉసిరిని పచ్చకామెర్ల చికిత్సలో ఉపయోగిస్తారు. అలోపతిలో పచ్చ కామెర్లకు మందులేదు. మానసిక రుగ్మతల చికిత్సలో జటామాంసి, అశ్వగంధి, బ్రహ్మి, జలబ్రహ్మి, వృద్ధదారు, శంఖపుష్పిని చాలా కాలంగా వాడుతున్నారు.

మూర్కొండ, తగిరిశ, తుప్ప తంగేడు, కసివింద, తెల్ల ఈశ్వరి, ఉత్తరేణి, పర్ణయవాని, నేల ములక, ఉచ్చింత.. ఇవన్నీ వినియోగంలో ఉన్న మొక్కలే. ప్రాణాంతకమైన హెర్పస్ సింప్లెక్స్ వైరస్ (హెచ్ఎస్‌వి) కారణంగా వచ్చే వ్యాధులను శక్తిమంతంగా అరికట్టే రెండు మొక్కలను ఇండియాలో కనుగొన్నారు. హైపరికమ్ హుకెరనమ్, హైపరికమ్ మైసోరెన్స్ అనే ఈ రెండు మూలికలు నీలిగిరి కొండల్లో విస్తారంగా దొరుకుతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆవిష్కరణ. ఎందుకంటే హెర్పస్ సింప్లెక్స్ వైరస్ వల్ల వచ్చే వ్యాధులకు అలోపతిలో ఔషధాలు ఇప్పటికీ లేవు. వైరల్ వ్యాధులకు మూలికా వైద్యంలో వున్న పరిష్కారాలు అలోపతిలో లేవని నిపుణుల అభిప్రాయం. అశ్వగంధ, తిప్పతీగ, శతావరి, బోడతరము, చిత్రమూలము, నేలతంగేడు, పసుపు, పాలసుగంధి, వచ, వెల్లుల్లి, అడ్డసర... హెచ్ఐవి రోగుల్లోనూ జవసత్వాల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు.

రక్తపోటుకు వాడే రిసెర్ఫిన్‌ను సర్పగంధి నుంచి రూపొందించారు. కార్డియోటానిక్ డిటిటాలిస్‌ను ఫాక్స్ గ్లోవ్ మొక్క నుంచి తయారు చేశారు. పిల్లల్లో వచ్చే లుకేమియా చికిత్సలో ఉపయోగించే విన్‌క్రిస్టిసిస్, విన్‌బ్లాస్టిన్‌సిన్‌లోను రోసి పెరివింకిల్‌గా చెప్పే బిళ్లగన్నేరు నుంచి తయారు చేశారు. మిరపకాయలు, పచ్చిబొప్పాయి ముక్కలు, అల్లం, యష్టమధు, రుబాబ్ మూలికలు లాలాజల ఉత్పత్తిని పెంచి పిండిపదార్థాలు జీర్ణం కావడానికి తోడ్పడుతాయి. బర్బెరీ, సెంటావరి, జెంటియన్, గ్లోడెన్ సీల్, దవనం వంటి మూలికలు ఆకలిని పెంచుతాయి. జామ ఆకుల కషాయంతో పుక్కిలిస్తే చిగుళ్ల వ్యాధులు, మాయం అవుతాయి. అజీర్తి వ్యాధులకు బొప్పాయి దివ్య ఔషధంగా చెబుతారు. మాంసాహార పదార్ధాలను తేలిగ్గా జీర్ణం చేసుకోవడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది. వాము గింజలను నెమ్మదిగా నములుతూ రసాన్ని మింగుతూ ఉంటే అజీర్తి, కడుపుబ్బరం తగ్గుతాయి. పసుపు కలిపిన నీళ్లతో జీర్ణవ్యవస్థ చక్కబడుతుంది.

వెల్లుల్లి :
వెల్లుల్లి సూక్ష్మజీవులను అతి సూక్ష్మజీవులను కూడా సంహరిస్తుంది. గాయాలకు చీము పట్టకుండా చేస్తుంది. చర్మవ్యాధులను, సుఖవ్యాధులను కూడా నయం చేస్తుంది. రక్తంలో కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని, మెదడులో రక్తస్రావ, రక్తపోటు ప్రమాదాలను నివారిస్తుంది. మధుమేహ వ్యాధిలో ఇన్సులిన్ అవసరాన్ని తగ్గిస్తుంది. జీర్ణవాహికలో అన్నిరకాల హానికర సూక్ష్మజీవులను నిర్మూలిస్తుంది. చైనాలో టీబీ చికిత్సలో కూడా వెల్లుల్లిని ప్రధాన ఔషధంగా వాడిన దాఖలాలున్నాయి. క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నాటి వైద్య గ్రంథాల్లోనూ వెల్లుల్లి ప్రస్తావన ఉంది. మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటిష్, రష్యా సైనికులు యుద్ధంలో క్షతగాత్రుల చికిత్స కోసం యాంటిబయోటిక్‌గా వెల్లుల్లిని వివరీతంగా వాడారు.
అర్జున :
ఇది ఉపఖండంలో పెరిగే వృక్షం. కార్డియాలజీ సమస్యలకు ఔషధంగా క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది గుండెకు బలాన్నిస్తుంది. ఒత్తిడిని, మానసిక ఆందోళనను దూరం చేస్తుంది. గుండెకు రక్త ప్రసరణను క్రమబద్దం చేస్తుంది. కడుపులో అల్సర్లు, ఇంటర్నల్ బ్లీడింగ్, ఆస్తమా, విరేచనాల్లో కూడా దీనిని ఉపయోగిస్తారు. చెడు కొవ్వును నిర్మూలిస్తుంది. లివర్ వ్యాధులనూ నివారిస్తుంది.
అశ్వగంధ :
అశ్వగంధ అంటే గుర్రం వాసనలను వెదజల్లేదని అర్ధం. శారీరక శక్తిసామర్థ్యాలను పెంచే ఔషధంగా చెబుతారు. అకాల వృద్ధాప్యాన్ని అరికడుతుంది. లైంగిక సామర్థ్యం ఉద్దీపనకేకాక, తీవ్రమైన మానసిక వత్తిడి కారణంగా తలెత్తే కీళ్లనొప్పులు, రక్తపోటు, మధుమేహం చికిత్సలోనూ దీనిని విరివిగా వాడతారు. వ్యాధినిరోధక సామర్థ్యాన్ని పెంచే అశ్వగంధ అనేక ఆయుర్వేధ ఔషధాల తయారీలో కూడా వాడతారు. ప్రపంచాన్ని ఊపేస్తున్న చైనా, కొరియా ఔషధ మొక్క జిన్‌సింగ్‌కు ధీటైన భారతీయ వెర్షన్‌గా అశ్వగంధను చెబుతారు.
మేషశృంగి :
తెలుగులో పొడపత్రిగా వ్యవహరించే మేషశృంగికి మధుమేహ వ్యాధిని అరికట్టే సామర్థ్యం ఉంది. అందువల్లే మధునాశిని అని కూడా అంటారు. స్వీట్స్‌పై ఆసక్తిని కూడా తగ్గించే శక్తి దీనికి ఉంది. విదేశాల్లో ఈ ఔషధంపై అనేక పరిశోధనలు జరిగాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచే విషయంలో ఈ ఔషధం శక్తిని అందరూ అంగీకరించారు.
అలోవెరా :
కలబందపై ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. దీన్ని మిరకిల్ ప్లాంట్‌గా వ్యవహరిస్తారు. వ్యాధులను నయం చేసే సహజసిద్ధమైన స్వభావం గల మొక్కగా చెబుతారు. శరీరానికి అవసరమైన అమినో యాసిడ్స్ కలబందలో పుష్కలంగా ఉన్నాయి. అనేకరకాల చర్మవ్యాధులకు దివ్యౌషధం.
శతావరి :
స్త్రీలవ్యాధులకు దివ్యౌషధం. హార్మోన్ల వ్యవస్థ సమతౌల్యాన్ని కాపాడుతుంది. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. మహిళల గర్భాశయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. తరుచు అబార్షన్లయ్యే మహిళలకు ఇది అద్భుత ఔషధంగా పనిచేస్తున్నట్టు చెబుతారు.
................................................
* వి.శ్రీనివాస్ - సెల్ : 99854 11006