Friday, December 23, 2011

ఆత్మజ్ఞానం..క్రియాయోగం

ఆత్మజ్ఞానం..క్రియాయోగం

మనిషి ఆత్మజ్ఞాన సాధన కోసం చేసేదే క్రియాయోగం. పతంజలి మహ ర్షి తన యోగ శాస్త్రంలో చెప్పిన క్రియా యోగం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన కర్మయోగం సంధానం చేసి క్రియాయోగంగా ప్రపంచానికి అందించారు శ్యామాచరణ లాహిరి. ఆయన శిష్యులలో అతి ముఖ్యులు, క్రియాయోగాన్ని విశ్వవ్యాపితం చేయడానికి కృషి చేస్తున్న డాక్టర్ అశోక్ కుమార్ చటర్జీ 79వ జన్మదినం నేడు. 
ఆ సందర్భంగా క్రియాయోగదర్శనం...
ప్రాణమే భగవంతుడని, దానినే ఈశ్వరుడు, విష్ణువు, శివుడు, అల్లా, జీసస్ ఇలా అనేక నామాలతో పిలవడం జరుగుతోందని తపస్సంపన్నులైన మన మహర్షులు, యోగులు చెబుతారు. అదే అనంత సృష్టిని ధరిస్తోంది. ఈ ప్రాణమే దేహంలో శ్వాస రూపంలో చంచలంగా ఉంది. దాన్ని స్థిరం చేసే విధానమే క్రియా యోగం. బయట శ్వాసని బయటే విడిచిపెట్టి దేహంలో ఉండే ప్రాణ, అపాన వాయువులతో చేసే అంతర్ముఖ ప్రాణాయామమే ఈ క్రియా యోగం. క్రియా యోగ సాధన వల్ల కేవలకుంభక స్థితిని పొందడం ద్వారా సమస్తమైన ప్రాపంచిక చంచలత్వం నశించి ప్రాణం, అంతర్ముఖం చెంది, స్థిర ప్రాణంగా అనగా కర్మాతీత, గుణాతీత, ఇచ్ఛారహిత నిర్గుణ పరబ్రహ్మని పొందడం జరుగుతుంది. ఇది ప్రాణ సాధన.

ఈశ్వరప్రాప్తికి మార్గం ఆత్మజ్ఞాన సంపన్నులైన మునులు, ఋషులు, యోగ పురుషులతో సనాతన భారతదేశం ఈ అనంత విశ్వంలో ధార్మిక జగత్తుకి రాజధానిగా నేటికీ విరాజిల్లుతోంది. సంసార బంధనాలలో చిక్కుకున్న బాధాతప్తహృదయులకు ఈశ్వరప్రాప్తి పొందే సహజమైన, సత్యమైన యోగసాధనను సంప్రాప్తింపచేయటానికి భగవానుడు 1828 సెప్టెంబర్ 30న యోగిరాజ శ్యామచరణ లాహిరి అవతారంలో జన్మించారు. బెంగాల్ నదియా జిల్లాలోని ఘుర్ని గ్రామంలో జన్మించిన లాహిరి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. తన మూడవ ఏటి నుంచే ధ్యానలోకంలోకి అడుగిడిన లాహిరి మెడ దాకా ఇసుక కప్పుకుని ధ్యానం చేసేవారు. ఆయన ఐదవ ఏట వరదలు వచ్చి పూర్వీకుల గృహం కొట్టుకుపోగా కుటుంబం వారణాసికి వలసవెళ్లింది. ఆయన జీవితకాలంలో ఎక్కువభాగం వారణాసిలోనే గడిపారు.

శ్యామాచరణులు వేదం, ఉపనిషత్తులు వంటి శాస్త్రాలతోపాటు ధార్మిక గ్రంథాలను అధ్యయనం చేశారు. ఉదరపోషణార్థం బెంగాలీ, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషలు నేర్చుకొని మిలటరీ ఇంజనీరింగ్ వర్క్స్‌లో గుమాస్తాగా చేరారు. వేతనం సరిపడనంతగా లేకపోవడం వలన కుటుంబ ఖర్చుల కోసం ట్యూషన్లు కూడా చెప్పేవారు. ఐదుగురు సంతానం కలిగి, అన్నదమ్ముల గృహకలహాల నడుమ జీవిక సాగిస్తూ యోగులు, సాధువులు, మహాత్ముల తపోభూమిగా, దేవభూమిగా ప్రసిద్ధిగాంచిన హిమాలయాలలో తపస్సు సాగిస్తున్న శ్రీకృష్ణ భగవాన్ స్వరూపులైన బాబాజీ వద్ద క్రియాయోగ దీక్షను పొందారు శ్యామాచరణులు.

వారి ఆజ్ఞమేరకు గృహస్థు యోగ్యతతో గృహస్థాశ్రమంలోనే ఉంటూ కఠోర యోగ సాధన చేసి కొత్తకొత్త ఎత్తులను అనాయాసంగా దాటుతూ, సాధనలో ఉచ్ఛతమ స్థితిని పొంది, సరళము, నిరాడంబరమైన, అతి స్వల్ప సమయంలో ఫలమిచ్చే క్రియాయోగ సాధనని సంసారులకు ఇవ్వడం ఆరంభించారు. కాశీలో నడిచే విశ్వనాథునిగా పేరుగాంచిన శ్రీత్రైలింగస్వామి వారి ప్రేమను, ప్రశంసలు, ఆదరాభిమానాలను లాహిరి మహాశయులు పొందగలిగారు.

దైవంతో సంభాషణ కుల, మత, జాతి, పేద, ధనిక అనే తారతమ్యాలు లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు, ఆత్మజ్ఞాన పిపాసులందరికీ క్రియాయోగ దీక్షని శ్యామాచరణులు అందచేశారు.'నీవు ఎవరికి చెందవు..అలాగే నీకూ ఎవరూ చెందరు. ఏదో ఒకరోజు హఠాత్తుగా ఈ లోకంలోని సమస్తాన్ని త్యజించవలసి వస్తుంది. ఇప్పటి నుంచే దైవంతో సాన్నిహిత్యాన్ని పొందు. క్రియోయోగం ద్వారా దైవంతో సంభాషించు. సత్యం నీకు గోచరిస్తుంది. ధ్యానం ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకో. జీవితంలో నీకు ఎదురయ్యే అన్ని చిక్కు ప్రశ్నలకు ధ్యానంలో సమాధానాలు లభిస్తాయి' అని శ్యామాచరణులు తన శిష్యులకు ఉద్బోధించేవారు.

షిరిడీ సాయినాథుడు కూడా లాహిరి మహాశయుల వద్ద క్రియా యోగ దీక్షను పొందినట్లుగా లాహిరి వారి రహస్య డైరీల ద్వారా తెలియవచ్చింది. 1895 సెప్టెంబర్ 26న తాను ఇక ఈ లోకాన్ని విడిచే సమయం ఆసన్నమైందని లాహిరి మహాశయులు తన శిష్యులు కొందరికి తెలియచేశారు. 'నేను నా స్వగృహానికి వెళుతున్నాను. నా గురించి చింతించకండి. నేను తిరిగి జన్మిస్తాను' అని చెప్పి మహాసమాధిలోకి ప్రవేశించారు శ్యామాచరణులు. హరిద్వార్‌లోని కేశవ ఆశ్రమంలో లాహిరి మహాశయులవారి సమాధిని దర్శించవచ్చు.

ఒకే పృథ్వి-ఒకే ధర్మం క్రియా యోగాన్ని పునఃస్థాపించిన శ్యామాచరణ లాహిరి శిష్యులలో ముఖ్యులు డాక్టర్ అశోక్‌కుమార్ చటర్జీ. లాహిరి మనుమడు స్వర్గీయ సత్యాచరణ లాహిరి వద్ద క్రియాయోగంలోని ఉత్తమ దశలన్నీ పొంది, అతి స్వల్ప కాలంలో మహోన్నత స్థితిని పొంది, ప్రపంచ క్రియా యోగాచార్యులుగా ఖ్యాతి గడించారు ఆయన. 1997 ఏప్రిల్ 27న ఫ్రాన్స్ దేశంలోని హ్యూగన్ పట్టణంలో టిబెట్ ఆధ్మాత్మిక గురువు దలైలామా ఆధ్వర్యంలో జరిగిన విశ్వధర్మ సమ్మేళనంలో మన దేశం నుంచి సనాతన ధర్మపు ఏకైక ప్రతినిధిగా చటర్జీ ఒక్కరికే ఆహ్వానం దక్కడం ఆయన కీర్తికి నిదర్శనం. ఆ సమ్మేళనానికి హాజరైన చటర్జీ 'రండి..అందరం కలిసి ఈ బహు ధర్మాల అస్థిత్వాన్ని మరచి, విభేదాలను విడనాడి ఒకే భగవంతుడు, ఒకే పృథ్వి, ఒకే ధర్మం, ఒకే మనిషి అనే సత్యాన్ని స్వీకరిద్దాం' అంటూ ఉత్తేజభరితంగా చేసిన ప్రసంగానికి అన్ని దేశాల మత ప్రతినిధులతోపాటు దలైలామా నుంచి కూడా ప్రశంసలు లభించాయి.

క్రియా యోగ రాజధాని నేడు కొందరు గురువులుగా చలామణి అవుతూ లాహిరి మహాశయులు అందించిన క్రియాయోగాన్ని రకరకాలుగా మార్పు చేసి, ఆ మహనీయుని పేరును దుర్వినియోగపరుస్తున్నారు. ఈ పరిస్థితులలో లాహిరి మహాశయులు అందించిన క్రియాయోగాన్ని యథాతధంగా అందించడానికి చటర్జీ దీక్షాబద్ధులై నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ చటర్జీ కోల్‌కతాకు 100 కిలోమీటర్ల దూరంలో గల కాకద్వీపంలో విశ్వానికంతటికీ క్రియా యోగ రాజధానిని నిర్మించారు. అలాగే ప్రధాన కేంద్రంగా లాహిరి మహాశయుల మందిరాన్ని నిర్మించి యోగిరాజ శ్యామచరణ సనాతన మిషన్‌ను స్థాపించారు. కుల, మత, దేశ తారతమ్యం లేకుండా ఆత్మ పిపాసులందరికీ క్రియాయోగ దీక్షను ప్రదానం చేస్తున్నారు డాక్టర్ చటర్జీ.

No comments: