Saturday, March 19, 2011

ప్రకృతి రంగుల్ని తినండి..!

ఇంద్రధనస్సులో సప్తవర్ణాలు ఎందుకుంటాయి..? ఆకాశం, భూమి నీలంలోనే ఎందుకు కనిపిస్తాయి..? ప్రకృతి పచ్చగా ఎందుకుంటుంది..? వీటి మధ్య బతికే మనిషి మీద ఈ రంగులన్నీ ప్రభావం చూపిస్తాయా..? అవుననే అంటున్నారు నిపుణులు. నేడు హోలీ సందర్భంగా రంగుల్ని చల్లుకోవడమే కాదు ఈ కలర్‌ఫుల్ ఫ్రూట్ బకెట్‌ను కూడా ఆరగించండి...
1. ఎరుపు : ఈ రంగు ఉద్వేగాలకు ప్రతీక. ఎరుపుతో నిగనిగలాడే స్ట్రాబెర్రీ తింటే, శరీరంలో కలిగే భావోద్వేగాలు క్రమబద్ధీకరించబడతాయి. ఇనుముతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచే జీవశక్తి ఈ ఎర్రపండులో పుష్కలం.

2. కాషాయం : శక్తికి, స్థిరత్వానికి సూచిక కావి (కాషాయ) వర్ణం. ఈ రంగు కలిగిన ఆరంజ్ తింటే విటమిన్-సి దొరుకుతుంది. అధిక రక్తపోటును బాగా నియంత్రిస్తుంది. జీర్ణప్రక్రియను మెరుగు పరుస్తుంది.

3. పసుపు : ఆశావాదాన్ని ప్రేరేపిస్తుంది పసుపు. యాంటీ సెప్టిక్‌గా పనిచేసే ఈ రంగు పైనాపుల్, మామిడి పండ్లలో లభిస్తుంది. విటమిన్-సి తోపాటు అనేక పోషకవిలువలున్న ఈ పండ్లను తింటే జీర్ణప్రక్రియను మెరుగుపడుతుంది.

4. ఆకుపచ్చ: ఆరోగ్య ప్రదాయిని ఆకుపచ్చ వర్ణం. అంతఃచ్చేతనాన్ని పెంచే గుణమున్న ఈ రంగు గ్రీన్ క్యాప్సికంలో అధికం. కూర వండుకుని దీన్ని తింటే ఇందులోని విటమిన్-ఎ, బి, సి మనసును నిత్యం ఉత్సాహంగా ఉంచుతుంది.

5. నీలం : దూరం నుంచి చూస్తే భూమి, ఆకాశం నీలవర్ణం కప్పుకున్నట్లు కనిపించడం సహజం. అందుకే మన శరీరం మీద కూడా నీలం ఎంతో కొంత ప్రభావం చూపిిస్తుందన్నది సత్యం. నీలంలో మెరిసే నేరేడు పండ్లు తింటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.

6. ఊదా : ప్రకృతి నుంచి మన శరీరానికి నేరుగా ఔష«««ధాలను అందిస్తుంది ఈ రంగు. అందుకే ఈ రంగుతో కాసిన వంకాయలను తింటే అలాంటి ప్రయోజనం అందరికీ లభిస్తుంది అంటున్నారు నిపుణులు.

7. వైలెట్ : మనసునే కాదు, శరీరాన్ని నిత్యం చురుగ్గా ఉంచుతుంది ఈ రంగు. నల్లద్రాక్ష తింటే ఈ రంగు వల్ల కలిగే ప్రయోజనాలన్నీ మన శరీరానికి లభిస్తాయి. ద్రాక్షలో విటమిన్ - సి ఎక్కువగా దొరుకుతుంది. చదివారు కదా! మీరు రోజూ తినే పండ్లలో ఈ ఏడు రంగులు ఉండేలా చూసుకోండి. ఈ రోజు హోలీని ఎంత ఎంజాయ్ చేశారో జీవితమంతా అంతే హాయిగా గడపండి.

No comments: