Monday, October 4, 2010

మద్యం అనే ద్రవం కడుపును ముంచేయడం ఖాయం!!!

కాలేయం పాడయ్యిందంటే... మొదట అడిగే మాట మద్యం అలవాటు
ఉందా అని. కడుపులో పుండ్లు పడ్డాయంటే అనుమానించేది... మద్యం
తీసుకుంటుంటారా అని. కాలేయాన్ని, కడుపును అంత నేరుగా ప్రభావితం
చేస్తుంది మద్యం. ఇతరత్రా అవయవాల మీద పరోక్ష ప్రభావమేమో గాని...
నోట్లోంచి కడుపులోకి మద్యం జారగానే అటు ప్రత్యక్ష దుష్ర్పభావాలూ,
పరోక్ష ప్రభావాలూ రెండూ కడుపు మీదే. తాగగానే నోట్లోనైనా అది పెద్దగా
ఉండకపోవచ్చేమోగాని... కడుపులోకి జారగానే అక్కడ కాసేపు ఉంటుంది
కాబట్టి అంతటి బలమైన ప్రభావం! దాంతో పోషకాలు అందకపోవడం,
విషపదార్థాలు ఉత్పత్తి అవడం, బరువు తగ్గడం, కాలేయం దెబ్బతినడం,
రోగనిరోధకశక్తి తగ్గడం వంటి అనేక దుష్ఫలితాలు!! ఉపద్రవంతో కొంప
మునిగినట్టు... మద్యం అనే ద్రవం కడుపును ముంచేయడం ఖాయం!!!


మద్యం అలా కడుపు (అన్నకోశం)లోకి వెళ్లీ వెళ్లగానే దాని దుష్ర్పభావం మొదలవుతుంది. అన్నకోశంలోకి వెళ్లగానే అక్కడ రెండు విధాలుగా దాని ప్రభావం చూపుతుంది. ఒకటి దాని నిర్మాణం మీద. రెండోది దాని విధులపైన. తొలుత అన్నకోశం నుంచి ఆల్కహాల్ రక్తంలో కలవడం ప్రారంభమవుతుంది. చాలా భాగం జీర్ణప్రక్రియకి గురి కాకుండానే రక్తంలో కలుస్తుంది. మద్యం నేరుగా చాలాసేపు అన్నకోశంలో ఉండటం వల్ల అక్కడి మృదువైన పొరలు (మ్యూకోజా) దెబ్బతింటాయి. అక్కడి మ్యూకోజాపై అది దీర్ఘకాలం పాటు ఉండటం వల్ల జీర్ణకోశం పై భాగంలో అనేక మార్పులు వస్తాయి. ఫలితంగా అప్పటికప్పుడు తగిలే దెబ్బతో పాటు దీర్ఘకాలికంగా ఉండే దుష్పరిణామాలు సైతం ఉంటాయి.

అన్నకోశంలోని మ్యూకోజాతో పాటు ఇతరత్రా కణజాలాన్ని మద్యం దెబ్బతీయడం వల్ల జీర్ణప్రక్రియ జరిగే క్రమంలో మార్పు వస్తుంది. జీర్ణక్రియ సమర్థంగా జరగకపోవడం ఫలితంగా శరీరానికి అందాల్సిన అవసరమైన పోషకాలు అందకపోవడం వంటి పరిణామాలు సంభవించవచ్చు. పైగా నిత్యం ఆల్కహాల్ తీసుకుంటూ ఉండటం వల్ల మ్యూకోజాపై రోజూ ప్రభావం పడి అక్కడ పుండ్లు, కురుపులు పడవచ్చు.

నోట్లోకి నీళ్లు వస్తుండటం, ఆహారం ఛాతీపై అంటుకున్నట్లుగా ఉండటం, నోట్లోకి పుల్లటి తేన్పులు వస్తుండటం వంటి లక్షణాలు ఆల్కహాల్ తీసుకునేవారిలో కనిపించే తొలి లక్షణం. మనం తీసుకునే ఆహారం నోట్లోంచి గొంతులోకి అన్నవాహికలోకి రాగానే అన్నవాహిక చివర ఉన్న స్ఫింక్టర్ కారణంగా అన్నకోశం (స్టమక్)లోనే ఉండిపోతుంది. అయితే మద్యం వల్ల ఆ స్ఫింక్టర్ తాను పట్టి ఉంచే సామర్థ్యాన్ని కోల్పోయి రిలాక్స్ అవుతుంది. ఫలితంగా గుండెల్లో మంట, కడుపులోంచి నోట్లోకి యాసిడ్ వచ్చి పుల్లగా అనిపించడం జరుగుతాయి. దాంతో పాటు చిన్న పేగులు, పెద్ద పేగుల్లోని కదలికలు మందగించవచ్చు. దాంతో తిన్నపదార్థాల కదలిక జరగాల్సినంత వేగంగా జరగక అవసరమైన పోషకాలు అందవు.

పాంక్రియాస్‌పై కూడా ప్రభావం.
పాంక్రియాస్ అన్నది జీర్ణప్రక్రియలో పాలుపంచుకునే మరో కీలక అవయవం. ఇది రక్తంలో గ్లూకోజ్ పాళ్లను నియంత్రణలో ఉంచే ఇన్సులిన్ హార్మోన్‌ను స్రవిస్తుంది. జీర్ణక్రియలో కొవ్వులు, ప్రోటీన్లు, పిండిపదార్థాలు జీర్ణమయ్యేలా దోహదపడుతుంది. మద్యం వల్ల ఈ అవయవం కూడా దెబ్బతిని తీవ్రమైన పాంక్రియాటైటిస్‌కు దారితీయవచ్చు. దానివల్ల కడుపులో నొప్పి, వాంతులు, ఊపిరి అందకపోవడం, కడుపులో ఇబ్బంది లాంటివి కనిపించవచ్చు. ఎప్పుడో ఒకసారి తాగేవారు మితం లేకుండా సేవించడం వల్ల ఈ సమస్య రావచ్చు. ఇలా పాంక్రియాటైటిస్ వచ్చిన వారిలో 15 శాతం మందిలో అది ప్రాణాంతకం కావచ్చు. ఇలాంటి సమయాల్లో వచ్చే నొప్పి కడుపు నుంచి మొదలై వీపుకు వ్యాపించవచ్చు. ఈ సమస్య వచ్చినప్పుడు కొవ్వులు సరిగా జీర్ణం కాకపోవడంతో మలం జిగటగా అనిపించవచ్చు.

1-దశ
మైల్డ్ ఫ్యాటీ లివర్


కాలేయంలోని కాలేయ కణాల స్థానంలో క్రమంగా కొవ్వు పేరుకోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. మద్యం తీసుకునేవాళ్లకు వచ్చే వ్యాధుల్లో ఇది తరచూ కనిపిస్తుంది. ఈ క్రమంలో కాలేయం కొద్దిగా ఉబ్బుతుంది (లివర్ ఎన్‌లార్జిమెంట్). దాంతో పొట్ట పైభాగంలో కుడి వైపున కొద్దిగా ఇబ్బంది ఉన్నట్లు అనిపిస్తుంది.

 
2-దశ
ఆల్కహాలిక్ హెపటైటిస్


కాలేయ కణాలు ఒక్కొక్కటీ మరింతగా దెబ్బతినడం వల్ల లివర్‌లో మంటతో కూడిన వాపు (ఆక్యూట్ ఇన్‌ఫ్లమేషన్) రావచ్చు. దాంతో బయటకు కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, కామెర్లు వంటివి బయటికి కనిపించే లక్షణాలు. దీంతో పాటు తెల్లరక్తకణాల పెరుగుదల, కాలేయం ఎరబ్రారడం (టెండర్ లివర్), రక్తనాళాలు సాలీడు కాళ్లలా చర్మం కింద ఉబ్బుగా కనిపించడం వంటివి కనిపిస్తాయి. మన శరీరంలోని మిగతా అవయవాల కంటే కాలేయానికి తనను తాను చక్కబరుచుకునే సామర్థ్యం చాలా ఎక్కువ. అందుకే ఈ దశ వచ్చాకనైనా మద్యం మానేస్తే అన్నీ చక్కబడి క్రమంగా కాలేయం మునుపటి ఆరోగ్యాన్ని పుంజుకుంటుంది.

3-దశ
ఆల్కహాలిక్ సిర్రోసిస్


కాలేయంలోని సాధారణ లివర్ కణజాలం (టిష్యూ) అంతా దెబ్బతిని కేవలం పని చేయని నిష్ర్పయోజనమైన కణజాలం మిగిలిపోయే దశ ఇది. దీన్ని లివర్ సిర్రోసిస్ అంటారు. ఈ దశలో కాలేయం తన సాధారణ ఆకృతిని కోల్పోతుంది. అంతేకాదు... అది కుంచించుకుపోతుంది. దాంతో పేగుల నుంచి కాలేయానికి వచ్చే రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని పోర్టల్ హైపర్‌టెన్షన్ అంటారు. దీని వల్ల ఆహార నాళంలోని రక్తనాళాలు (సిరలు) సైతం ఉబ్బి ఒక్కోసారి అవి చిట్లే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఒక్కోసారి రక్తపు వాంతులు కావడం లేదా మలంలో రక్తం కనిపించవచ్చు. మలంలో రక్త స్రావం కావడం వల్ల మలం నల్లగా వస్తుంది.

కాలేయంపై దుష్ర్పభావం ఎందుకు..?

శరీరంలోకి ఏవైనా విషపదార్థాలు ప్రవేశించగానే వాటిని విరిచేసి వాటి ప్రభావాన్ని నిర్మూలించే విధులను కాలేయం నిర్వహిస్తుంది. మద్యం ఒక రకమైన విషం (టాక్సిన్) కావడం వల్ల దాన్ని విరిచి వేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ పనిలో కాలేయం తాను నిత్యం చేయాల్సిన దానికంటే ఎక్కువగా మరింత ఎక్కువగా పనిచేస్తుంది. ఇక అలవాటుగా మద్యం తాగేవారిలో ఈ విషయాలను విరిచేసే పనిని అదేపనిగా చేస్తుండటం వల్ల కాలేయంపై భారం పడుతుంది. కాలేయంపై పడే దుష్ర్పభావాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.

మద్యం తీసుకునేవారిలో పొట్ట వస్తుండటం సాధారణంగా చూసేదే. మద్యం తీసుకున్న తర్వాత చాలా మందిలో కనిపించే పరిణామం ఇది. మరీ పెరిగినప్పుడు బెలూన్‌లో నీళ్లు నింపి కదిలిస్తే కదిలినట్లుగా పొట్టలో నీరు చేరి కదులుతూ ఉంటుంది. మద్యం అలవాటు పెరిగినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. దీన్నే ‘అసైటిస్’ అంటారు. ఇది కూడా మద్యం వల్ల వచ్చే అనర్థమే.

చికిత్స...
కాలేయ సమస్యలకు మద్యం మానడంతోనే చికిత్స మొదలైనట్లు లెక్క. నిజానికి అదే పెద్ద చికిత్స అన్నమాట.

మొదటిదశ ఫ్యాటీ లివర్‌కు, రెండోదశ ఆల్కహాలిక్ హెపటైటిస్‌కు మద్యం నుంచి దూరంగా ఉండటం ప్రధానం.

కాలేయం దాదాపు 75 శాతం చెడిపోయినా తాను నిర్వహించే విధులలో ఎక్కడా లోపం కనిపించనివ్వదు. తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ఇక అది మూడో దశకు వచ్చిందంటే మళ్లీ తిరిగి మునుపటి ఆరోగ్యాన్ని పొందడం చాలా కష్టం. ‘సిర్రోసిస్’ అనే దశకు చేరుకుంటే కేవలం కాలేయ మార్పిడి తప్ప మరో అవకాశం లేదని తెలుసుకోవాలి.

కొంతమందికి ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా చికిత్స అవసరం. మరికొందరికి అవసరాన్ని బట్టి శస్తచ్రికిత్స చేయాల్సి ఉంటుంది.

No comments: