Friday, January 14, 2011

ఫుడ్ కాంబినేషన్స్ రైటా? రాంగా?

పాలకూర- టొమాటో, చేపలు - పెరుగు, పొట్లకాయ - కోడిగుడ్డు ... ఇవన్నీ రాంగ్ కాంబినేషన్సా!? కానే కాదు. రోజూ మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఏవేవి, ఎందుకు కలిపి తినకూడదు? తప్పకుండా తినవచ్చు. తినకూడదనుకోవడం అపోహే. పప్పు తింటే కడుపు ఉబ్బరం, పండ్లు తింటే అజీర్తి, పాలు తాగితే అలెర్జీ... వంటి సమస్యలు ఎందుకు తలెత్తుతాయి? ఫుడ్‌కాంబినేషన్స్‌లో తలెత్తే అనుమానాలు, అపోహలు నివృత్తి చేసి, శరీరానికి కొన్ని పడనప్పుడు ఏం చేయాలో తెలిపే కథనమే ఈ  ముందు జాగ్రత్త.

టొమాటో + పాలకూర

టొమాటోలో ఆగ్జలేట్స్ అధికంగా ఉంటాయి. పాలకూరలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఈ రెండింటి కలయిక వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని చాలామందిలో అపోహ. కాని వంశపారంపర్యం, నీళ్లు తక్కువ తాగడం.. వంటి కారణాల వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అంతే తప్ప టొమాటో-పాలకూర కలిపి తినడం వల్ల కాదు.

పొట్లకాయ + గుడ్డు

పొట్లకాయలో నీటి శాతం ఎక్కువ. అలాగే పీచుపదార్థాలు, బి-విటమిన్లు ఉంటాయి. దీని నుంచి వచ్చే శక్తి కూడా తక్కువే. గుడ్డు తెల్లసొనలో అత్యధికంగా ప్రొటీన్లు, పచ్చసొనలో పిండిపదార్థాలు, ఎసెన్షియల్ ఫ్యాటీయాసిడ్స్, ఐరన్, లెసిథిన్ ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి వండి తినడం వల్ల ఎలాంటి హాని జరగదు.

చేపలు + పెరుగు
చేపలు తిన్న తర్వాత పెరుగు తింటే రుచిగా ఉండదు అనే తప్ప ఇది రాంగ్‌కాంబినేషన్ ఎంత మాత్రం కాదు. చేపల్లో ఉండే ప్రొటీన్లు చర్మం, గుండె, శిరోజాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెరుగులో క్యాల్షియం, పిండిపదార్థాలు, విటమిన్ ‘సి’... ఉంటాయి. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు.

భోజనం + పండ్లు

అన్నంతో పాటుగా పండ్లు తీసుకుంటే అజీర్తి చేస్తుందని చాలా మంది అపోహపడుతుంటారు. ఇది ఎంతమాత్రం నిజం కాదు. అన్నం, కూరలు, స్వీట్లు, పండ్లు ఒకేసారి మోతాదుకు మించి తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణం కాక ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆ విషయం తెలియక భోజనంలో పండ్లు తీసుకోకూడదు అనుకుంటారు.

నూనెలు + నూనెలు

వెజిటబుల్ ఆయిల్స్‌ను ఇతర ఆయిల్స్‌లో కలిపి వంటలో ఉపయోగిస్తే మంచిది అనుకుంటారు. కాని అది నిజం కాదు. నూనెలను విడివిడిగా ఉపయోగించాలి. అలాగే ఒకసారి వాడిన నూనెనె తిరిగి 72 గంటలలోగా మళ్లీ ఉపయోగించవచ్చు. లేదంటే అలా వాడిన నూనెకు ఆక్సిడేషన్ జరుగుతుంది. దానిని పదార్థాల రూపంలో మనం తీసుకున్నప్పుడు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఆకుకూరలు + కూరగాయలు + పప్పు దినుసులు

ఆకుకూరల వేర్లలో మట్టితో పాటు ఉండిపోయిన బ్యాక్టీరియా స్పోర్‌లా తయారవుతుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత హాని చేస్తుంటుంది. సరిగ్గా శుభ్రపరచకుండా వేరే పదార్థంతో వండితీసుకున్నప్పుడు ఇబ్బంది తలెత్తుతుంది. ఈ విషయం తెలియక ఫలనా ఆకుకూరను కూరగాయలను కలిపి వండడం వల్లే ఇలా జరిగిందని అనుకుంటారు. అందుకని ఆకుకూరలను కట్‌చేయడానికి ముందు పదినిమిషాల సేపు ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టాలి. పప్పులతో పాటు ఆకుకూరలను ఉడకబెడితే వాటిలో ఉండే పోషకాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకని ఆకుకూరలను విడిగా తగినంత ఉష్ణోగ్రతలోనే మగ్గించి, పప్పు ఇతర కూరగాయల్లో కలుపుకోవాలి.
పడని పదార్థాలు

కొందరికి పాలు, పాల ఉత్పత్తులు పడవు. ఇంకొందరికి గుడ్డు తింటే అలెర్జీ. ఇలా ఏదైనా ఆహారం పడకపోవడం అనే సమస్య పుట్టుకతోనే వస్తుంది. లేదంటే ఏదైనా శస్తచ్రికిత్స అయిన తర్వాత ఇలాంటి సమస్యలు గమనిస్తుంటాం. ఏవైనా పదార్థాలు పడటం లేదు అని పూర్తిగా మానేస్తే అందులోని పోషకాలు మనం కోల్పోయినట్టే. ఫలితంగా పోషకాహార లోపం తలెత్తుతుంది. అందుకని ప్రత్యామ్నాయ ఆహారాన్ని తీసుకోవాలి. అదెలాగంటే.. పాలు పడని వారు మజ్జిగ ఉపయోగించడం వంటివి.

ఆహారం తినగానే వాంతులు అవడం, కడుపునొప్పి, తలనొప్పి, ఒళ్లంతా దద్దుర్లు వస్తే ఫుడ్ ఫాయిజనింగ్‌కి ఇవి సాధారణ లక్షణాలని గమనించాలి. పడని పదార్థాలు ప్రభావం 48 గం.ల వరకు ఉంటుంది. కొన్ని జాగ్రత్తలతో సమస్యను నివారించుకోవచ్చు. దద్దుర్లు వచ్చి ముఖం వాచడం, విరేచనాలుతీవ్రంగా గొంతునొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తితే విషాహార ప్రభావం చాలా తీవ్రంగా ఉందని గమనించి వైద్యుల సలహా తీసుకోవాలి.

విషాహారానికి విరుగుడు...
మితంగా పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యం పట్ల తీసుకునే ముందు జాగ్రత్త. ఫుడ్ పాయిజనింగ్‌కి వందల రకాల బాక్టీరియా కారణం అవుతుంటుంది. తిన్న ఆహారం పడకపోవడం జరిగితే లక్షణాల బట్టి వెంటనే ప్రథమ చికిత్స చేయాలి.

గ్లాస్ నీటిలో టీ స్పూన్ ఉప్పు కలిపి తాగితే తిన్న ఆహారం వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుంది.
నీళ్లు ఎక్కువగా తాగాలి. దీని వల్ల ఆహారంలో చేరిన రసాయనాలు నీళ్లలో కలిసిపోయి బయటకు వస్తాయి.
పల్చని మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు కలుపుకొని తాగాలి. లేదా పెరుగు తినాలి. పెరగులో ఉండే లాక్టోబాసిలై బ్యాక్టీరియా అజీర్తిని నివారిస్తుంది.
అజీర్తిగా అనిపిస్తే అరటిపండు తినడం మంచిది.
ఆహారం తిన్న తర్వాత గుండె దడగా అనిపించినా, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా, కళ్లు తిరిగి పడిపోయినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. 


No comments: