Wednesday, January 26, 2011

చురుకుగా ఉండాలంటే .....

eating1
నేటి మహిళకు చురుకుదనం చాలా అవసరం. ఇంటి పనులు, పిల్లలను బడికి పంపించడం వంటి పనులతో కొన్నిసార్లు ఆహారాన్ని అసంపూర్తిగా తీసుకుంటారు కొంతమంది గృహిణులు. ఇలా చేయడం వల్ల శరీరంలో శక్తి తగ్గిపోవడమే కాకుండా పనులలో వేగం తగ్గుతుంది. అందుకే ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో చిన్న మార్పులు చేస్తే మేథాశక్తిని పెంచుకుని మరింత చురుకుగా ఉండొచ్చు. మెదడు మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. కండరాలు దృఢంగా తయారు కావాలంటే ప్రోటీన్లు ఉన్న ఆహారం ఏ విధంగా అవసరమో, అలాగే మెదడు చురుకుగా పనిచేయటానికి కూడా తగిన ఆహారం తీసుకోవాలి. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం లోనే చిన్న చిన్న మార్పులు చేస్తే మేథాశక్తిని పెంచుకోవచ్చు. మరింత చురుకుగా ఆలోచించవచ్చు. నభై ఏళ్ళు దాటిన వారికి జ్ఞాపకశక్తి తగ్గటమే కానీ పెరగటం ఉండదు. అయితే తగిన ఆహారం తీసుకుంటే ఈ తగ్గుదలను పూర్తిగా అరికట్టవచ్చు.


ఉదయం పూట తినే టిఫిన్‌ని చిన్న చూపు చూడవద్దని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడు చురుకుగా పనిచేయటానికి అవసరమైన శక్తిని గ్లూకోజ్‌ ఇస్తుంది. మనం తీసుకునే బ్రేెక్‌ఫాస్ట్‌, ఈ గ్లూకోజ్‌ను అందిస్తుంది. బ్రేెక్‌ఫాస్ట్‌ మానేస్తే చురుకుదనం తగ్గుతుంది.


బ్రేక్‌ఫాస్ట్‌లో...
eating
ఉదయమే బిస్కట్స్‌, పిజ్జా, కేక్స్‌, బర్గర్‌ వంటి పదార్థాలను తినే పిల్లలు కానీ పెద్దవారు కానీ అంత చురుకుగా వ్యవహరించలేకపోతారు. వాటికి బదులు బీన్స్‌, మొలకెత్తిన గింజలు వంటివి తీసుకునేవారు చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకుంటారు. వీటికితోడు పాలు తప్పనిసరి. పీచు (ఫైబర్‌) ఉన్న ఆహారపదార్థాలు ప్రధానంగా ఆకుకూరలు వంటివి అత్యధికంగా మేలు చేస్తాయి. బేకరీలలో తయారైన వస్తువులకు దూరంగా ఉండాలి. ఇవి ట్రాన్స్‌ ఫాటీ యాసిడ్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేయకపోగా క్యాన్సర్‌ కారకాలుగా పనిచేస్తాయి.


మధ్యాహ్న భోజనం....
ఇక మధ్యాహ్న భోజనం విషయానికి వస్తే కోడిగుడ్లు తప్పనిసరి. కోడిగుడ్డు నుంచి మన శరీరం అవసరమైన శక్తిని తయారు చేసుకోగలుగుతుంది. ఎసెటిల్కోలైస్‌ దీనికి ఒక ఉదాహరణ. ఇది తక్కువైతే ఆల్జిమర్స్‌ వ్యాధి వస్తుంది. న్యూరో ట్రాన్స్‌ మీటర్స్‌ జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మెదడును ఉత్తేజపూరితం చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఆకుకూరలు, పళ్ళు, పచ్చని కూరలే శరీరానికి మిత్రులు అనేది గుర్తుంచుకోండి. వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉండటమే కాక ఫైబర్‌ అత్యధిక స్థాయిలో ఉంటుంది. పెరుగును ఎక్కువగా తీసుకోవటం మరిచిపోవద్దు. పెరుగు ‘అమినో యాసిడ్‌ టైరోసిన్‌’లను కలిగిఉంది. ఇది వత్తిడిని తట్టుకునేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా న్యూరో ట్రాన్స్‌ మీటర్లను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడుతుంది. పెరుగు మెదడుకే కాక, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జీర్ణ కోశాన్ని చక్కగా పనిచేసేలా చేస్తుంది.


చేపతో లాభాలెన్నో...
చేప సంబంధ ఆహారపదార్థాల గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇవి గుండెపోటు రాకుండా నివారిస్తాయి. నేత్ర సంబంధ వ్యాధులను రాకుండా అరికడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో కొవ్వు శాతం బాగా తక్కువ. అందువల్ల ఇవి ఇతర మాంస సంబంధ ఆహార పదార్థాల మాదిరిగా శరీరానికి ఎంత మాత్రమూ హాని చేయవు. మేధస్సును అపరిమితంగా శక్తివంతం చేస్తాయి. వీటిలో ఉండే ఓమేగా-3 ఫాటీ యాసిడ్స్‌ మెదడులోని కణాలను ఉత్తేజితం చేస్తాయి. ఏ ఇతర ఆహారం పదార్థాంలోనూ ఈ స్థాయిలో ఒమేగా3 ఫాటీ యాసిడ్స్‌ ఉండవు.

No comments: