Wednesday, September 1, 2010

ఇవన్నీ జనాబాధలు

" ప్రతి ఏడాది నేను హిమాలయ శ్రేణుల్లోకి వెళ్లి కొద్ది కాలం గడుపుతాను. ఏ కాలంలో వెళ్లినా పర్వతసానువుల మీద మంచు కనిపిస్తూ ఉండేది. మూడేళ్ల క్రితం నుంచి మంచు కనిపించటం లేదు. తెల్లటి మంచు బదులు నల్లటి రాళ్లు కనిపిస్తున్నాయి'' - ఇది ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ ఆవేదన. ఆధ్యాత్మికతకు, మన చుట్టూ ఉండే ప్రపంచానికి, మనం పరిరక్షించాల్సిన పర్యావరణానికి చాలా దగ్గర సంబంధం ఉందని, ఈ మూడిటి మధ్య సమతౌల్యం దెబ్బతింటే మనిషి మనుగడకే ప్రమాదమనే జగ్గి వాసుదేవ్- ఇటీవల పి.వి. నరసింహారావు పర్యావరణ పురస్కారాన్ని అందుకోవటానికి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను 'నవ్య' పలకరించింది. ఆధ్యాత్మికత నుంచి అణుశక్తి వరకూ జగ్గి వాసుదేవ్ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

పరిమితం.. అపరిమితం
మనకు ప్రకృతి ప్రసాదించిన నీరు, నేల పరిమితం. దీనిని జాగ్రత్తగా వాడుకోకపోతే అనేక ఇబ్బందులు తప్పవు. కొన్నింటిని మనం అప్పుడే ఎదుర్కొంటున్నాం కూడా. మనకు అందుబాటులో ఉన్న నేల పెరగలేదు. కాని జనాభా పెరుగుతోంది. జనాభా పెరుగుతున్నప్పుడు వారికి కనీస సౌకర్యాలు కల్పించాలి. కల్పించాలంటే- అడవులను ఆక్రమించాలి. భూమిని సాగుచేయాలి. విద్యుత్ ఉత్పాదకత పెంచుకోవాలి. వీటన్నింటినీ మనం అభివృద్ధి అని పిలుచుకుంటున్నాం. కాని దీని ప్రభావం ప్రకృతి సమతౌల్యం మీద పడుతోంది. ముందు నుయ్యి- వెనక గొయ్యి అనే విధంగా మన పరిస్థితి తయారయింది.

మీకో ఉదాహరణ చెబుతాను. 1950లలో మన జనాభా దాదాపు యాభై కోట్లు. ఇప్పుడు నూట ఇరవై కోట్లు. ముందు చెప్పినట్లు మనకు అందుబాటులో ఉండే నేలలో మార్పులేదు. కాని జనాభా అదనంగా డెబ్భై కోట్లు పెరిగారు. వీరందరికి కనీస సౌకర్యాలు కల్పించాలంటే- అదనంగా గృహాలు నిర్మించాలి. శుభ్రమైన నీళ్లు అందించాలి. మృష్టాన్న భోజనాలు కాకపోయినా- రోజుకు రెండు పూటలా పౌష్ఠికాహారం ఇవ్వాలి. ఇవన్నీ సమకూర్చే క్రమంలో సహజంగానే పర్యావరణానికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోతే- పేద ప్రజల జీవన విధానంలో ఎటువంటి మార్పు రాదు. చేపడితే- పర్యావరణానికి ఇబ్బందులు తప్పవు. నేను 1980ల నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది హిమాలయాలలోకి వెళ్లి కొద్ది కాలం గడుపుతా.

ఒకప్పుడు ఏ కాలంలో వెళ్లినా హిమాలయసానువుల మీద మంచు కనిపించేది. ఇప్పుడు తెల్లటి మంచు బదులుగా నల్లటి రాళ్లు కనిపిస్తున్నాయి. గంగానది పుట్టిన ప్రదేశాన్ని గోముఖ్ అంటారు. అంటే ఆవు ముఖం మాదిరిగా ఉన్న ప్రదేశం అని అర్థం. ఒకప్పుడు- రెండు నుంచి మూడు అడుగుల వెడల్పు ఉన్న ఈ ప్రదేశం నుంచి నీరు వేగంగా పడుతూ ఉండేది. ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్లి చూస్తే నీళ్లు లేకపోవటమే కాదు. అంతా బీడుపడినట్లు కనిపిస్తుంది. దీనికి కారణం గ్లోబల్ వార్మింగ్. ఈ సమస్యకు నేను సూచించే పరిష్కారం- జనాభా నియంత్రణ. దీనిని ప్రస్తుతం మన దేశంలో అందరూ మర్చిపోయారు. దీని అవసరాన్ని గుర్తించటం లేదు. మన జనాభా పెరగకుండా- ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటే- భవిష్యత్తులో పర్యావరణంపై తీవ్రమైన ఒత్తిడి ఉండదు. జనాభా నియంత్రణ చర్యలను చేపట్టడానికి ఏ రాజకీయ నాయకుడూ ముందుకు రావడం లేదు.

మతాతీతంగా యోగా
మనకు చాలా ఉత్కృష్టమైన సంస్కృతీ సంప్రదాయాలు ఉన్నాయి. కాని దురదృష్టమేమిటంటే- చాలా మంది- మేధావులుగా పేరుమోసిన వారితో సహా-మన సంస్కృతిలో ఉన్న అంశాలు కేవలం మూఢనమ్మకాలని, పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినవి మాత్రం శాస్త్రీయమైన అంశాలను భావిస్తూ ఉంటారు. మిడిమిడి జ్ఞానం వల్ల వచ్చే సమస్యలివి. ఉదాహరణకు యోగవిద్యలో అనేక అద్భుతమైన అంశాలున్నాయి. వీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే అనేక రకాల వ్యాధులు మన దగ్గరకు కూడా చేరవు.

కానీ వీటిపై మనం సక్రమంగా దృష్టిపెట్టము. అదే యోగాపౖౖె విదేశాల్లో పరిశోధనలు జరిగి మళ్లీ మన దగ్గరకు వస్తే- వాటిని ఆశ్చర్యంగా చూస్తాం. ఆచరించడం మొదలు పెడతాం. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. యోగవిద్యను మతానికి అతీతంగా చూడగలిగితే అప్పుడది అన్ని వర్గాలకు అది చేరగలుగుతుంది. అందుకోసమే- నేను యోగవిద్యను నేర్పేటప్పుడు- మతానికి సంబంధించిన భావనలను వ్యక్తీకరించను. సంస్కృతీ పరమైన అంశాలను మాత్రమే చెబుతాను. దీని వల్ల ఏ దేశంవారైనా, ఏ ప్రాంతం వారైనా యోగవిద్యను నేర్చుకోవటానికి వీలుంటుంది.

జూ భావన

(యునైటెడ్ నేషన్స్ మిలీనియం పీస్ సమ్మిట్, ద ఆస్ట్రేలియన్ లీడర్‌షిప్ రిట్రీట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి సదస్సుల్లో జగ్గి వాసుదేవ్ భారతీయ ఆధ్యాత్మికత గురించి, యోగవిద్య గురించి ప్రసంగించారు)

No comments: