Showing posts with label EYE. Show all posts
Showing posts with label EYE. Show all posts

Tuesday, December 28, 2010

పసికందులు అంధులైతే....

మనదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చొప్పున పిల్లలు అంధత్వానికి గురవుతున్నారు. ఆ లెక్కన ప్రస్తుతం మన దేశంలో రెండు లక్షలా డెబ్బై వేల మంది చిన్నారులు అంధులుగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. రెండేళ్లలోపే అంధత్వానికి గురైన పిల్లల్లో సుమారు 50 శాతం మంది 5 ఏళ్ల లోపే చనిపోతున్నారు. నిజానికి అంధత్వాన్ని కలిగించే ఈ సమస్యల్లో 70 శాతం దాకా నివారించడం సాధ్యమయ్యేవే. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి అవసరమైన వైద్య, శస్త్ర చికిత్సలు అందించకపోతే అది అంధత్వానికి దారి తీస్తుంది. అందుకే ముందస్తు జాగ్రత్తలే పిల్లలను అంధత్వ ముప్పునుంచి తప్పిస్తాయంటున్నారు, నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ మాధవి.
శుక్లాలతో పుట్టిన పిల్లలను చూసి జాలిపడతారు. లేదా ఉన్నంతలో ఏదో ఆర్థిక సహాయం చే స్తారు. అంతేగానీ, వెంటనే వైద్యపరీక్షలు చేయించడం గానీ, మందులతోనో లేదా శస్త్ర చికిత్సల ద్వారానో పరిస్థితి చక్కబడే అవకాశాల గురించి ఆలోచించడమో చాలా మంది చేయరు. ఫలితంగా పరిస్థితి చక్కబడే అవకాశం కూడా జారిపోయి, వారు శాశ్వత అంధులుగా మారే స్థితికి దారి తీస్తుంది.

కొంత మంది పిల్లలు కార్నియా లోపం కారణంగా పుట్టుకతోనే అంధులవుతారు. అయిన వాళ్లంతా ఆ స్థితిని ఎవరూ ఏమీ చేయలేర న్నట్లు వదిలేసి ఊరుకుంటారు. నిజానికి కార్నియా మార్పిడి చికిత్సతో కొంత మేరకైనా వారికి తిరిగి చూపు అందించే అవకాశాలు ఉంటాయి. నేత్ర వైద్య విభాగంలో వచ్చిన అధునాతన చికిత్సల గురించిన అవగాహన లేకపోవడమే సమాజంలో మన దేశంలో లక్షలాది మంది పిల్లలు జీవితమంతా అంధులుగానే ఉండిపోయే పరిస్థితి ఎదురవుతోంది.

పిల్లల్లో వచ్చే విటమిన్-ఎ లోపాలు, మశూచికం, రుబెల్లా, ఆఫతాల్మిక్ నియోనెటోరియం వంటి సమస్యలను నివారించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక శుక్లాలు, నీటికాసులు (గ్లకోమా), కార్నియా అంధత్వం, మెల్లకన్ను, రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యురిటీ, రెటినో బ్లాస్టోమా, మరికొన్ని దృష్టిలోపాలు వీటిని వైద్య చికిత్సలతో తొలగించడం సాధ్యమవుతుంది. కానీ, ఈ విషయం తెలియక కంటి సమస్యలను అవేవో శాప ఫలితాలు అన్నట్లు అలా వదిలేయడం వల్ల ఎంతో మంది పిల్లలు కనుచూపు నోచుకోకుండా కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.

ఎలా తెలుస్తాయి ?

సాధారణంగా ఆరు మాసాల వయసు నుంచే పిల్లలు తల్లిని గుర్తు పడుతుంటారు. పరిశీలనగా అన్ని వైపులా చూడటం కూడా చేస్తుంటారు. ఆ లక్షణాలేమీ కనిపించకపోతే ఆ పిల్లల్లో కంటికి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నట్లు భావించాలి. తరుచూ కనురె ప్పలు కొట్టుకోవడం, కనుగుడ్లు అదేపనిగా తిప్పుతూ ఉండడం, రంగు వస్తువులను చూపినా వాటిమీద దృష్టి పడకుండా మరోవైపు చూడటం, కళ్లు మరీ పెద్దవిగా ఉండడం వంటివి కూడా కంటి సమస్యలు ఉన్నట్లు అనుమానించే అంశాలే.

అయితే తలిదండ్రులకు ఈ విషయాల మీద అనుమానం కలిగినా వయసు పెరుగుతూ ఉంటే ఇవన్నీ వాటంతట అవే పోతాయి అనుకునే వారే ఎక్కువ. కానీ, ఆ లక్షణాలు ఆ తరువాత ఒక తీవ్రమైన సమస్యకు గురిచేస్తాయనే అవగాహన లేక పోవడమే ఇందుకు కారణం. పిల్లల్లోని ఈ అసహజ లక్షణాలను ముందే గుర్తించి మందులో లేదా శస్త్ర చికిత్సలో అందిస్తే ఆ తరువాత పిల్లలు చూపు కోల్పోయే పరిస్థితి రాకుండా నివారించవచ్చు.

విటమిన్-ఏ లోపాలు:

పిల్లల్లో కార్నియా సమస్యతో వచ్చే అంధత్వానికి విటమిన్-ఏ లోపమే ప్రధాన కారణం. ఈ లోపం వల్ల ముందుగా రేచీకటి సమస్య వస్తుంది. బాగా అలవాటైన ప్రదేశంలో కూడా పిల్లలు రాత్రిపూట తడబడుతున్నా, పదే పదే వస్తువులను గమనించక వాటిని పడదోస్తున్నా అది రేచీకటి సమస్యగా గుర్తించాలి.

కంటిలో తడి ఆరిపోవడం, తెల్లగుడ్డుపైన బూడిద రంగు మచ్చలు ఏర్పడటం ఉంటాయి. చివరి దశలో కార్నియా దెబ్బతిని అంధత్వం వస్తుంది. నివారణగా ప్రతి ఆరుమాసాలకు ఒకసారి 200000 ఐయు విటమిన్-ఎ ఇస్తూ ఉండాలి. పాలు ఇచ్చే తల్లులకు ప్రసవం నుంచి తగిన మోతాదులో విటమిన్-ఏ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మశూచి టీకాలు కూడా ఇప్పించడం ద్వారా కార్నియా సమస్యను నియంత్రించవచ్చు.

కళ్లకలక (ఆఫతాల్మిక్ నియోనెటోరియం) కొంత మంది పిల్లలు 10 రోజుల వయసులోనే కళ్లకలక సమస్యకు గురవుతుంటారు. గర్భిణులు బ్యాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లకు గురైనప్పుడు ఆ సమస్య కడుపులో ఉన్న శిశువుకు కూడా సోకుతుంది. ఫలితంగా పుట్టిన శిశువు కళ్లల్లో పుసులు కట్టడం, కళ్లలోంచి ఒక జిగురు పదార్థం స్రవించడం కనిపిస్తుంది.

వెంటనే వైద్యం అందకపోతే కంటి కార్నియా దెబ్బతిని అంధత్వం రావచ్చు. అందుకే గర్భిణిగా ఉన్నప్పుడు గానీ, ప్రసవ సమయంలో గానీ, తల్లులు ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడటం చాలా ముఖ్యం. అలాగే పుట్టిన పాప కళ్లు పరీక్షించి కళ్లకలక ఉంటే కళ్లను శుభ్రపరుస్తూ పొవిడీన్ ఐయాడీన్ ద్రావకం చుక్కలను కంటిలో వేయాలి.

రుబెల్లాతో జాగ్రత్త...

మూడు నుంచి ఆరుమాసాల గర్భంతో ఉన్నప్పుడు తల్లులు రుబెల్లా అనే వైరల్ ఇన్‌ఫెక్షన్లకు గురైతే బిడ్డ పలురకాల రుగ్మతలతో పుడుతుంటారు. ముఖ్యంగా పుట్టుకతో వచ్చే గుండెలోపాలు, చెవిటితనం, మానసిక వైకల్యం, రోజులు గడిచే కొద్దీ దంతాల లోపాలు, కంటి శుక్లాలు, గ్లకోమా, రెటీ నా పరమైన వ్యాధులు కూడా ఈ పిల్లలకు రావచ్చు. ఈ స్థితిని నివారించడానికి యుక్తవయసులో ఉన్న యువతులకు రుబెల్లా టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలి.

అపోహలూ ఎక్కువే...

పిల్లల్లో కంటి సమస్యలు ఎన్ని ఉన్నా వయసు పెరిగితే వాటంతట అవే త గ్గిపోతాయనుకోవడం, కళ్లు ఎరుపెక్కితే తల్లి చనుబాలు పోయడం, కొన్ని సందర్భాల్లో కంట్లో ఆకు పసర్లు, ఇతర మూలికా మందులు వేయడం, గర్భిణిగా ఉన్నప్పుడు అవసరమైన మందులు, టీకాలే వీ తీసుకోకపోవడం, మేనరిక వివాహాలు ఇవన్నీ పిల్లల్లో కంటి సమస్యలను పెంచి చివరికి వారి చూపునే హరిస్తున్నాయి.

పిల్లల్లో శుక్లం

ప్రతి రెండు వేల మంది పిల్లల్లో ఒక రు పుట్టుకతోనే శుక్ల సమస్యకు గురయ్యే వీలుంది. కొంతమంది పిల్లలకు పుట్టుకతో గానీ, కొంత వయసు వచ్చిన తరువాత గానీ ఒక కంట్లో లేదా రెండు కళ్లల్లో శుక్లాలు రావచ్చు. ఇందుకు గల కారణాల్లో బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఇన్ ఫెక్షన్లకు గురికావడం, జన్యుపరమైన కార ణాలు, కంటికి బలంగా దెబ్బ త గలడం వంటివి ప్రధానమైనవి.

ఈ వ్యాధి సోకినప్పుడు కనుపాప నల్లగా కాకుండా తెలుపు రంగులోకి మారుతుంది. ఈ పిల్లల్లో వెలుతురు చూడలేకపోవడం, చూపు నిలబెట్టలేకపోవడం, కనుగుడ్డును అతిగా తిప్పడం, ఎక్కువగా కళ్లు చిట్లించి చూడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ స్థితిలో శస్త్ర చికిత్స ద్వారా శుక్లాన్ని తీసివేయడం ఒక్కటే పరిష్కారం. శుక్లాల కారణంగా పిల్లల్లో చేసే శస్త్ర చికిత్స, పెద్దవారిలో చేసే శస్త్ర చికిత్స ఈ రెండు వేరు వేరు.

రెండేళ్ల లోపు పిల్లలకు ఈ శస్త్ర చికిత్స చేసినప్పుడు వారికి ఐదేళ్లు వచ్చేదాకా లావుపాటి అద్దాలు వాడాల్సి ఉంటుంది. రెండవ సారి శస్త్ర చికిత్స చేసి కంట్లో అద్దం అమర్చాక సాధారణ అద్దాలే సరిపోతాయి. అయితే ఒకసారి ఈ శస్త్ర చికిత్స జరిగిన పిల్లలను జీవితాంతం నేత్రవైద్యుని పర్యవేక్షణలో ఉంచడం చాలా అవసరం.

గ్లకోమా (నీటికాసులు)

ఈ వ్యాధి సోకే వారిలో పెద్ద వారే ఎక్కువగా ఉంటారు. అయితే పిల్లల్లోనూ ప్రతి 10 వేల మందికి ఒకరు చొప్పున ఈ వ్యాధి బారినపడుతుంటారు. గ్లకోమాతో కంటిలో ఒత్తిడి పెరిగి, అక్కడున్న నరం దెబ్బ తిని అంధత్వం వస్తుంది. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో కనుపాప పెద్దదవుతుంది. వెలుతురు చూడలేకపోవడం, కంట్లోంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కంటిలోని ఒత్తిడిని తగ్గించడానికి శస్త్ర చికిత్స ఒక్కటే పరిష్కారం. ఆ తరువాత కూడా ఒత్తిడి తగ్గకపోతే మరోసారి శస్త్రచికిత్స చేయవలసి రావచ్చు. లేదా మందులు వాడవలసి రావచ్చు. ఏమైనా గ్లకోమా ఉన్న వారు జీవితాంతం డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం చాలా అవసరం.

మెల్ల

మెల్ల ఉన్నప్పుడు ఒక క న్ను సమాంతరంగా ఉండదు. అందుకే రెండు కళ్లనుంచి మెదడుకు చేరే ప్రతిబింబాలు కూడా సమంగా ఉండవు. మెదడు స్పష్టంగా ఉన్న ప్రతిబింబాన్ని పరిగణనలోకి తీసుకుని మసకగా ఉండే రెండవ ప్రతిబింబాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. అలాగే ఇంకొంత కాలం గడిస్తే మెల్లకంటి చూపు మరింత తగ్గి చివరికి అంధత్వానికి దారి తీస్తుంది. ఈ స్థితిని యాంబిలోపియా అంటారు.

మెల్ల కన్ను ఉన్నప్పుడు ఆరేళ్ల లోపే గుర్తించి తగిన వైద్య చికిత్సలు చేయవలసి ఉంటుంది. మెల్ల నివారణలో కంటి కండరాలను సరిచేయడానికి శస్త్ర చికిత్స కూడా అవసరమవుతుంది. మెల్లను పూర్తి స్తాయిలో తొలగించడానికి కొందరికి రెండవసారి కూడా శస్త్ర చికిత్స చేయవలసి రావచ్చు. శస్త్ర చికిత్స తరువాత దృష్టిలోపాలకు కళ్లజోడు కూడా వాడవలసి ఉంటుంది.

కంటి చూపు వృద్ధికి...

కొంత మంది పిల్లల్లో మందులతోగానీ, శస్త్ర చికిత్సల వల్ల గానీ చూపును మెరుగుపరిచే అవకాశాలు ఉండవు. అలాంటి వారిలో అప్పటికి ఇంకా మిగిలి ఉన్న చూపును మెరుగుపరిచే ఆధునిక చికిత్సలు కొన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పిల్లల ప్రస్తుత కంటి చూపును అంచనా వేసి కొన్ని రకాల బూతద్దాలు, టెలిస్కోపులు, ప్రత్యేకమైన కళ్లజోడు, కొన్ని ప్రత్యేకమైన లైట్ల ద్వారా పిల్లల చూపును మెరుగు పరిచే అవకాశాలు ఉన్నాయి.

అయితే అప్పటికే అంధత్వం కారణంతా బ్రెయిలి లిపికి అలవాటు పడితే ఈ పరికరాలను ఉపయోగించడానికి అంతగా ఇష్టపడరు. అందుకే చిన్న వయసులోనే పిల్లల అంధత్వాన్ని అంచనా వేసి అందుబాటులో ఉన్న సదుపాయాలను వినియోగించుకుంటే ప్రయోజనం ఉంటుంది. పుట్టుకతో వ చ్చిన అంధత్వాన్ని పూర్తిగా జయించలేకపోయినా, ప్రయోజనకరమైన కంటిచూపును పొందే అవకాశాలు ఉన్నాయి. "ఆలస్యం...అమృతం...విషం'' అన్న నానుడి పిల్లల కంటి సమస్యల విషయంలో నూటికి నూరు పాళ్లు నిజం.


-డాక్టర్ జి.మాధవి
కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు,
మెడికల్ డైరెక్టర్, గౌతమి ఐ ఇనిస్టిట్యూట్, రాజమండ్రి,
ఫోన్ : 9502136068

పంచదార కళ్లు * డయాబెటిస్ వల్ల కంటిపై పడే ప్రభావాలు, వాటి లక్షణాలు, నివారణ, చికిత్స

చక్కెర నోటికి తీపి గానీ... కళ్లకు మాత్రం చేదే. చక్కెర వ్యాధి ప్రభావం ఎంత చేదుగా ఉంటుందో తెలిసిన విషయమే. అన్ని అవయవాలపై దుష్ర్పభావం చూపించే ఆ వ్యాధికి కన్ను మినహాయింపేమీ కాదు. అన్ని అవయవాల్లాగే కన్ను కూడా డయాబెటిస్‌కు ప్రభావితమవుతుంది. చక్కెరను నియంత్రించుకోకపోతే అది డయాబెటిక్ రెటినోపతి అనే సమస్య మొదలు అనేక రుగ్మతలకు దారి తీయవచ్చు. వాటిని నిర్లక్ష్యం చేస్తే చూపునే కోల్పోవాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు. అందుకే... చక్కెర వ్యాధి సూచనలు కనిపించగానే కంటిపై ఆ వ్యాధి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ వల్ల కంటిపై పడే ప్రభావాలు, వాటి లక్షణాలు, నివారణ, చికిత్స లాంటి అనేక అంశాలను తెలుసుకోడానికే ఈ కథనం...

ప్రతి అవయవానికి పోషకాలు అందించే బాధ్యత రక్తానిది. ఈ రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంటుంది. ఈ నాళాల చివరన ఉండే అత్యంత సూక్ష్మమైన నాళాలను రక్తకేశనాళికలు (క్యాపిల్లరీస్) అంటారు. దీర్ఘకాలంగా రక్తంలో చక్కెర పాళ్లు ఎక్కువగా ఉండేవారిలో కేపిల్లరీస్ దెబ్బతింటాయి. రక్తంలో పెరిగే గ్లూకోజ్ పాళ్ల వల్ల ఈ రక్తనాళాల చివర్లలో అడ్డంకులు (బ్లాకేజ్) ఏర్పడవచ్చు. ఫలితంగా ఆ అవయవానికి రక్తం అందకపోవచ్చు. దాంతో ఆ అవయవం శాశ్వతంగా చచ్చుబడే ప్రమాదం ఉంది. కంటిలో ఉండే రక్తనాళాల చివరల్లోనూ ఇలాంటి బ్లాక్స్ రావడం సంభవిస్తే చూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.

డయాబెటిస్ వల్ల వచ్చే వ్యాధులివి...
డయాబెటిక్ రెటినోపతి

డయాబెటిక్ క్యాటరాక్ట్

గ్లకోమా నర్వ్ పాల్సీ ఆప్టిక్ న్యూరోపతి

కనురెప్పకు తరచూ వచ్చే ఇన్ఫెక్షన్

కనురెప్పలు వాలిపోవడం

కంటిలోపల ఉండే పొర కంజెంక్టివాకు వచ్చే ఇన్ఫెక్షన్లు

కార్నియాకు వచ్చే సమస్యలు.

డయాబెటిక్ రెటినోపతి... ఏదైనా వస్తువును చూసినప్పుడు దాని ప్రతిబింబం కంటిలోపల ఉండే ఒక తెరపై పడుతుంది. ఆ తెరపై పడే ప్రతిబింబం వల్లనే మనం చూడగలమన్నది తెలిసిందే. ఈ తెరనే ‘రెటీనా’ అంటారు. అన్ని అవయవాల్లాగే ఈ రెటీనాకు కూడా అత్యంత సూక్ష్మమైన నాళాల ద్వారా రక్తం సరఫరా అవుతుంటుంది. చక్కెర వ్యాధి వల్ల ఈ రక్తనాళాలు దెబ్బతిని రెటీనాకు రక్తం సరిగ్గా అందక చూపు దెబ్బతినే పరిస్థితిని ‘డయాబెటిక్ రెటినోపతి’ అంటారు. దీని వల్ల శాశ్వతంగా చూపు కోల్పోవాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా అంధత్వానికి చాలా ఎక్కువగా ఉన్న కారణాల్లో ఇది ప్రధానమైనది.

 
‘డయాబెటిక్ రెటినోపతి’ ఎవరెవరిలో ఎక్కువ...
దీర్ఘకాలంగా చక్కెర వ్యాధి ఉన్నవారికి

చక్కెరను అదుపు చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండేవారికి

డయాబెటిస్‌తో పాటు అధిక రక్తపోటు ఉన్నవారికి

డయాబెటిస్‌తో పాటు కొలెస్ట్రాల్ పాళ్లు, రక్తంలో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి

కిడ్నీ సమస్యలు ఉన్నవారికి

గుండె జబ్బులు ఉన్నవారికి

పొగతాగేవారికి... వీళ్లందరిలో డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

గమనిక : షుగర్ పూర్తిగా నియంత్రణలో ఉన్నా రెటినోపతి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చక్కెర వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా కంటి వైద్యనిపుణులను తరచూ సంప్రదించడం అవసరం.

తస్మాత్ జాగ్రత్త...
డయాబెటిక్ రెటినోపతితో బాధపడే వారిలో, చూపు కోల్పోయే వారిలో - తమకు ఈ దుష్ర్పభావం పడబోతుందన్న విషయం దాదాపు సగానికి మందికి పైగా తెలియనే తెలియదు. ఒక్కోసారి కంటికి చేసే సాధారణ (రొటీన్) పరీక్షల్లో ఈ విషయం బయటపడుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది.

డయాబెటిక్ రెటినోపతి కేసుల్లో ఏం జరుగుతుంది?
డయాబెటిస్ ఉన్నవారిలో కంటిలోని అత్యంత సూక్ష్మమైన రక్తనాళాల చివరలు ఉబ్బుతాయి. ఇలా రెటినాకు చెందిన రక్తనాళాల చివరలు ఉబ్బడాన్ని ‘మైక్రో అన్యూరిజమ్’ అంటారు. ఇవి ఉబ్బి ఉబ్బి ఒక్కోసారి చిట్లి రక్తస్రావం కావచ్చు. ఇలా రక్తస్రావం కావడాన్ని ‘డాట్ అండ్ బ్లాట్ హ్యామరేజ్’ అంటారు. కొన్నిసార్లు కంటిలోని ద్రవాలు లీక్ కావచ్చు. అలా జరిగితే దాన్ని ‘మాక్యులార్ ఎడిమా’ అంటారు. అప్పుడు రెటీనా నుంచి కొత్త రక్తనాళాలు ఆవిర్భవించవచ్చు. దీన్నే ప్రొలిఫిరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఇలా కొత్తరక్తనాళాలు పుట్టుకురావడమే కంటికి ప్రమాదకరం అవుతుంది.

నేత్రవైద్యులు ఇందుకోసం చేసే పరీక్షలివి
ఫండస్ ఎగ్జామినేషన్

ఫండస్ ఫ్లోరోసిన్ యాంజియోగ్రఫీ

ఓసీటీ (ఆప్టికల్ కొహెరెన్స్ టోమోగ్రఫీ)

అల్ట్రా సౌండ్ ‘బి’ స్కాన్

చికిత్స
డయాబెటిస్ రెటినోపతీకి అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలు
1. వైద్యపరంగా అందించే చికిత్స
2. లేజర్ ఫోటోకోయాగ్యులేషన్
3. శస్తచ్రికిత్స (విట్రెక్టమీ)

1. వైద్యపరంగా చేయాల్సిన చికిత్స:
రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రించడానికి చికిత్స చేయాలి.

రక్తంలో కొవ్వులను నియంత్రించడానికి చికిత్స (కొలెస్ట్రాల్ తగ్గించడానికి)

యాంటీప్లేట్‌లెట్ ఏజెంట్స్ (రక్తం పలచబరచడానికి మందులు)

బీ కాంప్లెక్స్ ఔషధాలు ఇవ్వాలి.

3. శస్తచ్రికిత్స:
రెటినోపతి వల్ల వచ్చే దుష్ర్పభావాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటే అప్పుడు అక్కడ గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడానికి విట్రెక్టమీ ఆపరేషన్ అవసరం కావచ్చు.

డయాబెటిక్ క్యాటరాక్ట్...
డయాబెటిస్‌తో శరీరంలోని జీవక్రియ (మెటబాలిజమ్) ల్లో మార్పుల వల్ల కొందరిలో కంటిలో త్వరగా క్యాటరాక్ట్ రావచ్చు. దీనివల్ల చూపు స్పష్టంగా కనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారిలో ఫ్యాకో ఎమల్సిఫికేషన్ వంటి ప్రక్రియలతో కంటి ముందు ఉంటే లెన్స్ మార్చి కృత్రిమ లెన్స్‌ను అమర్చాల్సి ఉంటుంది.

గ్లకోమా...
కంటిలో ఉండే ద్రవాలలో ఒత్తిడి పెరిగి అది కంటి నరం మీద పడటాన్ని గ్లకోమా అంటారు. ఈ ఒత్తిడి వల్ల క్రమంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. యాంటీ గ్లకోమా చుక్కల మందు కంట్లో వేయడం ద్వారా దీన్ని నివారించవచ్చు. అయితే దీన్ని జీవితకాలం వాడాల్సి ఉంటుంది. కొంతమందికి శస్తచ్రికిత్స ద్వారా కూడా గ్లకోమాను నయం చేసే అవకాశాలు ఉంటాయి.

ఆప్టిక్ న్యూరోపతి...
కంటిలో కనిపించే ప్రతిబింబాన్ని ‘ఆప్టిక్ నర్వ్’ మెదడుకు చేరవేయడం వల్లనే మనకు చూపు కనిపిస్తుంటుందన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ఈ నరం దెబ్బతినడం వల్ల కంటి చూపు అకస్మాత్తుగా దెబ్బతింటుంది. ఈ నరం దెబ్బతిన్న విషయాన్ని ఫండస్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కంటి వైద్యులు, న్యూరోఫిజీషియన్ ఆధ్వర్యంలో చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది.

చూపును దీర్ఘకాలం పదిలంగా కాపాడు కోవడం కోసం కంటి పరీక్షలు తరచూ చేయించడం అవసరం. డయాబెటిస్ ఉంటే అది మరింత అవసరమని గుర్తుంచుకోవాలి.

2. లేజర్ ఫోటోకోయాగ్యులేషన్
లేజర్ కిరణాల సహాయంతో చేయాల్సిన ఈ చికిత్స వల్ల కంటిలో రక్తస్రావాన్ని తగ్గించడం కొత్తగా ఏర్పడే రక్తనాళాలను నివారించడం సాధ్యమవుతుంది. ఈ చికిత్స ప్రక్రియలో కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ చికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. ఒకసారి చికిత్స చేశాక జీవితకాలం పాటు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

ఎన్నాళ్లకోమారు..?
డయాబెటిస్ ఉన్నవారు ఏడాదికి ఒకసారి కంటి పరీక్షలు చేయించాలి.

డయాబెటిక్ రెటినోపతి ఉన్నవారు ప్రతి ఆర్నెల్లకు ఓ మారు పరీక్షలు చేయించాలి.

డయాబెటిక్ రెటినోపతి తీవ్రంగా ఉంటే ప్రతి మూడు నెలలకోమారు పరీక్షించుకోవాలి.

నివారణ...
డాక్టర్లు చెప్పినవిధంగా మంచి పోషకాలు, పీచుపదార్థాలు ఎక్కుడా ఉండే ఆహారాన్ని క్రమబద్ధంగా తీసుకోవడం.

ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం

వ్యాయామం

క్రమం తప్పకుండా రక్తంలో గ్లూకోజ్ పాళ్లను పరీక్షించుకుంటూ దాన్ని నియంత్రించుకోవడం

పొగతాగే అలవాటును పూర్తిగా మానివేయడం.